రాజధాని కేంద్రంగా ఉద్యమాల్లో పాల్గొంటున్న పీసీసీ చీఫ్
టీడీపీ దూకుడును అడ్డుకునేందుకు నెహ్రూ వ్యూహాలు
నగరంలో పార్టీని బతికించుకునేందుకు మల్లాది విష్ణు తాపత్రయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ నగరంలో కాంగ్రెస్కు పూర్వవైభవాన్ని సాధిం చేందుకు ఆ పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. తెలుగుదేశం అధికారం చేపట్టిన తరువాత రెండు నెలలపాటు స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు పది నెలలుగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్యక్రమాలు చేశారు. విజయవాడలో జరిగే ప్రతి ఆందోళనలోనూ పీసీసీ చీఫ్ రఘువీరా ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా పాల్గొంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మహిళలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. ఇక ఏఐటీయూసీ, సీఐటీయూ నిర్వహించే ఆందోళనా కార్యక్రమాల్లో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మల్లాది విష్ణు పాల్గొని వారి పోరాటాలకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాపత్రయపడుతున్నారు.
మునిసిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు పాలకమండలి తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించే ప్రయత్నమే చేసింది. ఇక జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. వీరిలో ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రభుత్వ ధనం దుర్వినియోగం, ప్రభుత్వ ధనాన్ని దోచుకునేం దుకు టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలపై పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ పలుమార్లు ధ్వజమెత్తారు. నెహ్రూ ప్రెస్మీట్లలో చేసిన వ్యాఖ్యలపై కాని, సభల్లో చేసిన ఆరోపణలపై మంత్రి ఉమా మాట్లాడిన దాఖలు లేవు.
నియోజకవర్గాలపై పట్టు
విజయవాడలో దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్లు తూర్పు నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆకుల శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కింకుకునేందుకు కడియాల బుచ్చిబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బుచ్చిబాబు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులు కాగా విష్ణు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.