► వైఎస్సార్ఎస్యూ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలలను హేతుబద్ధీకరణ పేరుతో మూసివేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ విద్యార్థి విభాగంనాయకులు డిమాండ్ చేశారు. సోమవారం డీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలలు, వసతి గృహాలు కనుమరుగుకానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లు మూసివేస్తే ఎక్కువ మంది డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉందన్నారు.
విద్యాహక్కు చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈఓ కార్యాలయంలో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు డీఈఓ అంజయ్య అక్కడికి చేరుకొని సర్దిచెప్పారు. అనంతరం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర కార్యదర్శులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శులు కేవీ మారుతీప్రకాష్, ఆవుల రాఘవేంద్రరెడ్డి, బాబా సలాం, సుధీర్రెడ్డి, దినేష్రెడ్డి, సునీల్, సాకే నవీన్, కార్యదర్శి సునీల్దత్తారెడ్డి, మహేష్, సురేష్, గోకుల్రెడ్డి పాల్గొన్నారు.