జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా కోటీశ్వరి

23 Nov, 2014 03:40 IST|Sakshi

చిత్తూరు (అర్బన్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (డీఎంఅండ్‌హెచ్‌వో)లో అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శని వారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కోటీశ్వరిని నియమించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో డీఎంఅండ్‌హెచ్‌వోగా పనిచేస్తున్న కోటీశ్వరిని చిత్తూరుకు బదిలీ చేశారు. ఈమె వచ్చే వారంలో చిత్తూరులో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎంఅండ్‌హెచ్‌వోల బదిలీల కౌన్సెలింగ్‌లో అధికారుల పనితీరు, సామర్థ్యం, సర్వీసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

తొలి నుంచి వైఎస్సార్ జిల్లాకు ప్రయత్నించిన చిత్తూరు డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్యకు నిరాశ ఎదురైంది. ఈయనను అప్రాధాన్యత శాఖకు బదిలీ చేశారు. రాయలసీమ జోనల్ మలేరియా అధికారిగా దశరథరామయ్యను నియమించారు. 2012 నవంబర్ 20న  డీఎంఅండ్‌హెచ్‌వోగా చిత్తూరులో బాధ్యతలు స్వీకరించిన దశరథరామయ్య రెండేళ్ల పాటు జిల్లాలో తన సేవలు అందించారు.

నెల్లూరుకు భారతి రెడ్డి
అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (ఏడీఅండ్‌హెచ్‌వో) అధికారిణిగా పనిచేస్తున్న భారతిరెడ్డిని ముందుగా అనుకున్నట్లు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. 2012 జనవరి 23న చిత్తూరులో ఏడీఎంఅండ్‌హెచ్‌వోగా భారతిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా నుంచి డీఎంఅండ్‌హెచ్‌వోగా పదోన్నతిపై వెళ్లడం సంతోషంగా ఉందని భారతిరెడ్డి తెలిపారు. ఈ నెల 29వరకు హైదరాబాదులో జరుగుతున్న శిక్షణలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 30 నెల్లూరులో బాధ్యతలు స్వీకరిస్తామని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు