బిడ్డలను రోడ్డుపై విడిచి చెక్కేసిన తండ్రి

18 Jun, 2015 06:58 IST|Sakshi
బిడ్డలను రోడ్డుపై విడిచి చెక్కేసిన తండ్రి

తల్లి జాడ తెలియని వైనం  
టూటౌన్ పోలీసుల చొరవతో చైల్డ్‌లైన్ చెంతకు..


ఒంగోలు క్రైం: తల్లి వద్ద నుంచి తన ఇద్దరు కుమారులను రెండు నెలల క్రితం నెల్లూరులో ఉంటున్న తండ్రి తీసుకొని వెళ్లాడు. అంతవరకు బాగానే ఉంది. తిరిగి బిడ్డలను భార్య వద్ద వదిలి పెట్టకుండా ఆమె ఒంగోలులో లేకుండా చూసి ఓ సినిమా హాలు వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఒంగోలు రైలుపేటలో నివాసం ఉంటున్న కగ్గా శ్రీను, నాగమణికి ఇద్దరు కుమారులు. కగ్గా గోపి (11), కగ్గా రాము(9). అయితే భార్య, భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు.

ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్లిన తండ్రి ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీనివాసా థియేటర్ వద్ద ఇద్దరు బిడ్డలను వదిలేసి, వారికి రూ.150 ఇచ్చి సినిమాకు వెళ్లమని చెప్పి  వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారులు థియేటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ శీనప్ప, కానిస్టేబుల్ ఎస్‌కే మస్తాన్ వలి గమనించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైలుపేటలోని వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు.

అయితే ఇంటి వద్ద ఆ చిన్నారుల తల్లి నాగమణి లేదు. స్థానికులను విచారణ చేశారు. ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు. దీంతో పోలీసులు చైల్డ్‌లైన్-1098 ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం ఇచ్చారు. రాత్రి 11.30 గంటల సమయంలో సాగర్ వచ్చి ఆ చిన్నారులను బొమ్మరిల్లు హోంలో చేర్పించారు. బాలల సంక్షేమ మండలి ముందు బుధవారం హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఇద్దరు పిల్లలను అదే హోంలో చేర్పించారు.

మరిన్ని వార్తలు