ముస్లింలకు అన్యాయం జరిగితే ఊరుకోం

14 Mar, 2016 04:45 IST|Sakshi
ముస్లింలకు అన్యాయం జరిగితే ఊరుకోం

నాలుగుశాతం రిజర్వేషన్ అమలులో  కుట్ర చేయొద్దు
ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి హెచ్చరిక

 
 
 కర్నూలు (ఓల్డ్‌సిటీ): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింమైనార్టీలకు కల్పించిన నాలుగుశాతం రిజర్వేషన్ల అమలు విషయంలో అన్యాయం జరిగితే  ఊరుకోమని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.  ఆదివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, మైనారిటీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. 4 శాతం రిజర్వేషన్లపై కొందరు కోర్టుకు వెళ్లడంతో  ఏప్రిల్ 18  నుంచి సుప్రీంకోర్టులో వాదనలు మొదలవుతాయన్నారు. రిజర్వేషన్లను బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించడానికి సీనియర్ న్యాయవాదులను నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.  బీజేపీతో చెలిమి నైపథ్యంలో ఈవిషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు.   రిజర్వేషన్లు ముస్లింల విద్యాభివృద్ధికి ముఖ్యమన్నారు. న్యాయవాది చాంద్‌బాష, మైనారిటీ నాయకులు అబ్దుర్రజాక్, ఎం.ఎ.హమీద్ మాట్లాడుతూ పొరపాటున రిజర్వేషన్లు చేజారిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.   రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సలీం, షరీఫ్, టి.వి.రమణ, బాబుభై, సర్వేశ్వరరెడ్డి, కంఠు, రాఘవేంద్రనాయుడు, అబ్దుల్‌గని, నాగార్జునరెడ్డి, ఊట్ల రమేశ్, కటారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు