ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

22 Mar, 2015 03:24 IST|Sakshi

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
 
పులివెందుల : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో సమావేశమయ్యారు. ముందుగా ఎంపీ తన వద్దకు వచ్చిన ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి సమస్యలను ఓపికగా విని పరిష్కారం కోసం అధికారులకు ఫోన్లు చేశారు. చిన్నకుడాల గ్రామానికి చెందిన బీసీ కాలనీ మహిళలు తమ కాలనీకి పార్నపల్లె నీరు రావడం లేదని ఎంపీకి మొరపెట్టుకోగా.. ఆయన సంబంధిత అధికారి డీఈ మోహన్‌కు ఫోన్ చేసి శనివారం రాత్రిలోగా కాలనీకి నీరు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అంతేకాకుండా ఎంపీ నిధుల ద్వారా గ్రామంలో సంప్ ఏర్పాటు చేస్తానని శాశ్వతంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కొంత మంది రేషన్ డీలర్లు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు చిన్న చిన్న తప్పులను సాకుగా చూపి వేధిస్తున్నారని ఆయన దృష్టికి తేగా, అందుకు ఎంపీ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొన్నారు.

జెడ్పీటీసీ సభ్యుడు వెంగముని, సింహాద్రిపురం పరిధిలోని సమస్యలు ఆయన దృష్టికి తేగా, పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కొంత మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కోరగా.. వివిధ కంపెనీల ప్రతినిధులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, రామగిరి జనార్థన్‌రెడ్డి, నల్లపురెడ్డిపల్లె బలరామిరెడ్డి, వేముల సాంబ శివారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు