శోకసంద్రంలో వరుడి కుటుంబం

5 Feb, 2015 00:56 IST|Sakshi
శోకసంద్రంలో వరుడి కుటుంబం

గుంటూరు : పచ్చనితోరణాలతో సందడిగా ఉన్న ఆ ఇల్లు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. తమ ఇంటికి కోడలుగా వస్తున్న యువతిని మృత్యువు మింగేసిందని తెలుసుకున్న వరుడి కుటుంబీకులు దుఃఖసాగరం లో మునిగిపోయారు. గుంటూ రు నెహ్రూనగర్ ఆరోలైన్‌కు చెందిన మునగా శివప్రసాద్, ధనలక్ష్మి దంపతుల రెండో కుమారుడు మునగా ఆనంద్ సౌత్‌ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి చల్లపల్లికి చెందిన అల్లంశెట్టి సాంబయ్య కుమార్తె అల్లంశెట్టి బాలాకుమారి అలియాస్ అమ్ములుతో వివాహం నిశ్చయమైంది. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది.

 నెహ్రూనగర్ 4వ లైనులోని కృష్ణ ప్లాజా ఫంక్షన్ హాలులో వివాహ ఏర్పాట్లుచేశారు. ఫంక్షన్ ప్లాజాను విద్యుత్ దీపాలు, పచ్చని తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. వధువు బాలా కుమారిని తీసుకువస్తున్న కారు తోట్లవల్లూరు వద్ద అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోవడంతో ఆమె సహా నలుగురు మృతి చెందగా, మరో మహిళకు సీరియస్‌గా ఉంది. దీంతో పెళ్లి కుమారుడి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంటనే మండపంలో విద్యుత్ దీపాల అలంకరణ తొలగించారు. పచ్చని తోరణాలను తీసి పక్కన వేశారు. వారి కుటుంబంతోపాటు బంధుమిత్రులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులు వెళ్లిపోవడంతో కల్యాణమండపం  వెలవెలబోయింది.

మరిన్ని వార్తలు