కడప అగ్రికల్చర్ : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో అక్కడక్కడ జరిగిన అవకతవకలపై సీబీసీఐడి విచారణ ప్రారంభించింది. సొసైటీలలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతామని ఇటీవల శాసనసభలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తిరుపతి సీబీసీఐడీ డీఎస్పీ కిశోర్ జిల్లా కేంద్రంలోని కేంద్ర సహకార బ్యాంకుకు వచ్చి సమాచారాన్ని సేకరించారు.
అనంతరం పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె, అనంతంపల్లె, అనంతసముద్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలలోని రికార్డులను తనిఖీ చేశారు. తిరుపతి నుంచి వచ్చిన సీబీసీఐడీ బృందం పదిరోజులపాటు జిల్లాలో ఉండి పలు విషయాలపై సమగ్రంగా విచారించనున్నట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకునేందుకు హైదరాబాదు నుంచి మరో బృందం జిల్లాకు రానున్నట్లు సమాచారం.