వివాదంగా మారిన పూసలకాలనీ సమస్య

19 May, 2016 06:13 IST|Sakshi
వివాదంగా మారిన పూసలకాలనీ సమస్య

ఇరువర్గాల ఘర్షణ
 
ఉదయగిరి: ఉదయగిరి - కావలి రోడ్డు మార్గంలోని పూసలకాలనీలో ఇళ్ల స్థలాల విషయమై బుధవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు..  ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో గతంలో ఎస్సీలకు ఇందిర ప్రభుత్వ హయూంలో ఇళ్ల స్థలాల్లో పక్కాఇళ్లు నిర్మించి ఇచ్చారు. కానీ ఆనాడు గ్రామ శివా రు అయినందున వారు అక్కడ నివాసం ఉండలేదు. ఈ నేపథ్యంలో  పదిహేనేళ్ల క్రితం సంచార జాతులకు చెందిన పూసలి వారు ఆ ఇళ్లలోనే కాపురముంటున్నా రు. కాని ప్రస్తుతం ఉదయగిరి పట్టణం విస్తరించడంతో ఆ స్థలాలకు గిరాకీ పెరిగింది. దీంతో ఎస్సీలు తమ ఇళ్లు ఖాళీ చేయాలని పూసలివారిపై ఒత్తిడి తెస్తున్నారు. 

9 నెలల క్రితం రెవెన్యూ అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి సర్దుబాటు చేశారు. పూసలకాలనీ వాసులకు ప్రభుత్వం స్థలాలు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎస్సీలు తమ స్థలాలకు సంబంధించి సరిహద్దు రాళ్లను నాటే నిమిత్తం బుధవారం పూసల కాలనీకి వెళ్లి పనికి ఉపక్రమించడంతో.. స్థానికులు ప్రతిఘటించారు. దీంతో రెండు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందడంతో సీఐ జె.శ్రీనివాసులు, ఎస్సై విజయకుమార్, పీఎస్సై ప్రతాప్ యాదవ్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. దీంతో ఆగ్రహించిన ఎస్సీలు కాలనీ సమీపంలోని రోడ్డుపై బైఠాయించారు.

పోలీసులు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో అక్కడి నుంచి విరమించారు. ఈ ఘర్షణకు సంబంధించి రెండు వర్గాల వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వల్పంగా గాయపడిన వారు  స్థానిక సీహెచ్‌సీలో చికిత్స చేయించుకున్నారు. ఎస్సై విజయకుమార్ తహశీల్దార్, ఆర్డీఓలకు సమాచారం అందించినట్లు చెప్పారు. పోలీసుపికెట్ ఏర్పాటుచేశారు.


 తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
 పూసలకాలనీలో చోటుచేసుకున్న పరిణామాలను నిరసిస్తూ తమకు తక్షణమే రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ ఆ కాలనీకి చెందిన ఎరుకల, యానాది కులాలకు చెందిన వారు బుధవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.  తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు