పోలీస్ జీప్ నుంచి దూకి వ్యక్తి మృతి

25 Jan, 2016 15:09 IST|Sakshi

మద్యం తాగి ఇంటి దగ్గర గొడవ చేస్తున్నాడని కన్న తల్లిదండ్రులే కొడుకు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని పోలీస్ జీప్‌లో స్టేషన్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలో జీపులో నుంచి దూకేశాడు. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా బందరు కోట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బందరు మండలం గరాలదిబ్బ గ్రామానికి చెందిన ఒడుగు రాముడు(38) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసై తరచు గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఆదివారం రాత్రి పూటుగ మద్యం తాగి ఇంటి దగ్గర నానా రబస చేశాడు. దీంతో విసిగిపోయిన అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని జీపులో తీసుకెళ్తుండగా.. అందులో నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించి జీపు బందరు కోట సమీపానికి రాగానే అందులో నుంచి దూకేశాడు. దీంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.

 

>
మరిన్ని వార్తలు