ఆందోళనల బాటలో ఆర్టీసీ కార్మిక సంఘాలు

4 Jan, 2016 00:22 IST|Sakshi

విజయవాడ: ఏపీఎస్‌ఆర్టీసీ యూనియన్‌లు సోమ, మంగళవారాల్లో ఆందోళన బాట పట్టనున్నాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 4న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్టు ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వై.వి.రావు ప్రకటించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్టు కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని, ఆర్టీసీ ఆసుపత్రి నిర్మించాలనే డిమాండ్స్‌పై ఈ ధర్నాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా, ఈ నెల 5 నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల ప్రక్రియ మొదలుకానుండటంతో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆందోళనలకు పిలునిచ్చింది. ఈ నెల 5న రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ రీజినల్ సెంటర్లలో ధర్నా నిర్వహించనున్నట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ సుందరయ్య ఆదివారం సాక్షికి చెప్పారు.

మరిన్ని వార్తలు