బాబు సర్కార్పై సీపీఐ రామకృష్ణ ధ్వజం
నందిగామ రూరల్ : అభివృద్ధికి బదులు పగటి కలలతో పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. నందిగామ పట్టణంలో చేపట్టిన గడపగడపకు సీపీఐ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన గురువారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్లో పాత్రికేయులతో మాట్లాడారు. శాసనసభ్యులను కొనుగోలు చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారని భావించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, తానేదో ఘనకార్యం చేసినట్టు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణమంటూ కోట్లాది రూపాయలు విరాళాలు సేకరించారని, రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం ప్లాన్ సిద్ధం చేయించలేకపోయారన్నారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కలసి కార్పొరేట్ సంస్థగా మార్చేశారని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జరబన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి చుండూరు వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.