ఇక్కడి కూరగాయలు.. విదేశాలకు

8 Dec, 2013 04:34 IST|Sakshi

=ఎగుమతులతో రైతులకు లాభం
 =త్వరలో ‘ఐ-అగ్రి’ సేవలు ప్రారంభం
 =‘సాక్షి’తో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ప్రశాంత్‌రెడ్డి

 
సాక్షి, హన్మకొండ: అంతర్జాతీయస్థాయి ప్రమాణాలు కలిగిన హైదరాబాద్‌కు వరంగల్ కేవలం 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇక్కడ పండే కూరగాయలు, పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ఎంతో సులభం అంటున్నారు ఐ-అగ్రి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ప్రశాంత్‌రెడ్డి. వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సుకు హాజరైన ఆ కంపెనీ మేనేజింగ్ డెరైక్టర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ కంపెనీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. జనవరి నుంచి వరంగల్‌లో తమ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఆ తర్వాత నాలుగు నెలల వ్యవధిలో ఇక్కడ పండే కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేయొచ్చని, తద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయని తెలిపారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..
 
నా సొంతూరు అనంతపురం. కంప్యూటర్ విద్యను లండన్‌లో పూర్తి చేసిన తర్వాత స్వదేశం వచ్చి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషన్‌లో స్థిరపడ్డాను. కానీ, మాది వ్యవసాయ కుటుంబం కావడంతో దానిపై ఆసక్తి ఏర్పడింది. నాణ్యమైన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉంటే.. మనదేశంలో సరైన మార్కెట్ ధర లభించక రైతులు ఇబ్బందులు  పడుతున్న విషయూన్ని గ్రహించాను.

ఈ రెండింటిని అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో ‘ఐ-అగ్రి’ అనే సంస్థను హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా గతేడాది ఏర్పాటు చేశాను. ఇక్కడ నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొంటూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మా కంపెనీ సామర్థ్యానికి మించి ఉత్పత్తి ఉంటే... అంతర్జాతీయ, జాతీయ మార్కెట్‌లో ఉన్న ఇతర పేరెన్నికగల కంపెనీల దృష్టికి తీసుకుపోతున్నాం. దాంతో మన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను కల్పిస్తున్నాం. ప్రయోగాత్మకంగా ఈ పని చేపట్టినా మంచి ఫలితాలు సాధించాం.
 
మొదటగా అనంతపురం..

మొదటగా అనంతరపురంలోని బత్తాయి రైతులతో సమావేశమై మా సలహా మేరకు పంటలు పండిస్తే మంచి ధరకు కొంటామని హామీ ఇచ్చాం. బత్తాయి పంట చేతికి వచ్చిన తర్వాత కోయడం, గ్రేడింగ్ చేయడం, భద్రపరచడం వంటి విభిన్న అంశాలపై శిక్షణ ఇచ్చాం. మా శ్రమ ఫలించింది. మొదటి ఏడాదే రూ. 30 లక్షల విలువ చేసే బత్తాయి ఉత్పత్తులను మిడిల్‌ఈస్ట్(గల్ఫ్) దేశాలకు ఎగుమతి చేయగలిగాం. ఆ తర్వాత నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూరగాయలు పండించే క్షేత్రాలకు మా కార్యకలాపాలను విస్తరించాం. ఆర్నేళ్ల వ్యవధిలో 1600 మంది రైతుల నుంచి నేరుగా పంట ఉత్పత్తులను కొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం.
 
జనవరిలో ప్రారంభం..

జనవరి నుంచి వరంగల్‌లో మా సేవలు ప్రారంభిస్తున్నాం. నెల రోజల వ్యవధిలో ఇక్కడి నేల స్వభావం, పండే పంటలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తులపై సూక్ష్మస్థాయి నుంచి వివరాలు సేకరిస్తాం. అలా గుర్తించిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను అమ్మేందుకు వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇస్తాం. పంట వేసిన తర్వాత మొదటి దశ ఉత్పత్తి వచ్చేంత వరకు సహకారం అందిస్తాం. ఆశించిన దిగుబడి రాగానే వరంగల్ నగరంలోనే గోదాములను ఏర్పాటు చేస్తాం. ఇక్కడి నుంచి రైలు, రోడ్డు మార్గం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను హైదరాబాద్‌కి తరలిస్తాం. అక్కడి నుంచి విమానాల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తాం. దేశీ మార్కెట్‌తో పోల్చితే విదేశీ మార్కెట్‌లో గిట్టుబాటు ధర ఎక్కువగా ఉంటుంది. రైతులకు మంచి లాభాలు వస్తాయి.
 

మరిన్ని వార్తలు