యువతిని కిడ్నాప్ చేసిన పూజారి అరెస్ట్

25 May, 2016 00:51 IST|Sakshi

పూజల పేరుతో పరిచయం

 
పెదకాకాని : పూజల పేరుతో యువతికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన పూజారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెదకాకాని శివాలయంలో చదలవాడ కిషన్‌కుమార్ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెను వెంట బెట్టుకుని ఆలయానికి పూజల కోసం వెళుతుండేది. ఈ క్రమంలో పరిచయమైన కిషన్ కుమార్ అలియాస్ కిషోర్ పూజా కార్యక్రమాల పేరుతో మహిళతో పరిచయం పెంచుకుని ఇంటికి వెళుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తెకు మాయ మాటలు చెప్పి ఈనెల 12వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి తీసుకువెళ్ళాడు. అదే రోజు రాత్రి మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.


రెండు రోజుల క్రితం ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్నామంటూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే, పూజారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో మాయమాటలు చెప్పి యువతిని కిడ్నాప్ చేసిన  కేసులో కిషన్‌కుమార్‌ను మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచినట్లు సీఐ సీహెచ్ చంద్రమౌళి తెలిపారు. నిందితుడికి 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

 

 

మరిన్ని వార్తలు