పల్లెర్లమూడిలో భారీ చోరీ

29 Aug, 2013 03:00 IST|Sakshi

పల్లెర్లమూడి(నూజివీడు రూరల్), న్యూస్‌లైన్ : మండలంలోని పల్లెర్లమూడిలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారీ దొంగత నం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి  చెందిన సొసైటీ అధ్యక్షుడు పెదర్ల సత్యవరప్రసాద్ శుభకార్యం నిమిత్తం మంగళవారం రాత్రి నూజి వీడు వచ్చారు. వివాహం ముగిసిన తరువాత రాత్రి ఒంటిగంట సమయంలో స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగా ముఖద్వారానికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల  బీరువా తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. అందులోని వస్తువులు, దుస్తులు మంచం మీద చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన రూ.90 వేలు నగదు, 45 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆయన గుర్తించారు. ఆభరణాల విలువ రూ.11.25 లక్షలు ఉంటుందని
బాధితుడు తెలిపారు.

 ఘటన జరిగిన రోజు వరప్రసాద్ భార్య వేరే ఊరికి వెళ్లారు. దొంగతనం గురించి సమాచారం అందుకున్న సీఐ సిహెచ్.వి.మురళీకృష్ణ, రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
 
తెలిసినవారి పనే ?
 సంఘటన జరిగిన తీరును చూస్తే బాగా తెలిసిన వ్యక్తులే చోరికీ పాల్పడి ఉంటారని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమ యం చూసుకుని అర్ధరాత్రి ఒంటిగంట లోపే తాళం పగులగొట్టి సొత్తు దొంగిలించుకుపోవడాన్ని బట్టి వీరు ఆ విధంగా అంచనాకు వచ్చారు. సత్యవరప్రసాద్ వివాహానికి వెళ్లిన సంగతిని, ఆయన భార్య ఊరికి వెళ్ళిన విషయాన్ని బాగా గమనించి ఈ చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు