జీవోలు చిత్తు కాగితాలేనా..!

7 Aug, 2015 02:06 IST|Sakshi

వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని మే 5న జీవో నెం 27 విడుదల
జిల్లాలో అమలుకాని వైనం
 
 నెల్లూరు(సెంట్రల్) : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం తయారుచేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. కానీ జిల్లాలోని కొందరు అధికారులు ఆ విషయాన్ని బయటకు పొక్కకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పభుత్వం జీవో నంబరు 27ను మే 5న విడుదల చేసింది. ఇప్పటివరకు జీవో గురించి అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. జీవోలు చిత్తుకాగితాల కిందే జిల్లా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు రూ.1 బియ్యం రేషన్ షాపుల నుంచి తెచ్చి పెడుతున్నారు.

ఆ బియ్యం తినలేక  విద్యార్థులు అల్లాడిపోతున్నారు.తెలంగాణాలో మాత్రం వసతి గృహ విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం పెడుతున్నారు. రాష్ట్రంలోని పాలకులకు మాత్రం పేద విద్యార్థులపై కనీస శ్రద్ధలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీవో ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన బియ్య పంపిణీ చేయాల్సింది పౌరసరఫరా శాఖ అధికారుల బాధ్యత అని పలువురు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు శాఖ మధ్య సమన్వయ లోపంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

 అసలు జీవోలో ఏముంది....
 2014 డిసెంబరు 27న స్టేట్ కౌన్సిల్ ఫర్ డెవలప్‌మెంటు షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ అధికారులు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం.ఏపీలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి నాణ్యమైన భోజనం పెట్టేందుకు రూ.22.52  కోట్లు అదనపు నిధులను  మంజూరు చేస్తున్నాం.

 కచ్చితంగా అమలు చేస్తాం...
 ప్రభుత్వ జీవో ప్రకారం విద్యార్థులను నాణ్యమైన బియ్యం అమలు చేయాలనే నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం. పౌరసరఫరాల శాఖ అధికారులతో మాట్లాడి ఈ నెల నుంచే అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.
 -వెంకటేశ్వర్లు, పీవో ఐటీడీఏ

 నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నాం..
 వసతిగృహాలకు పంపణీ చేయాల్సిన బియ్యంలో గతం కన్నా ఉన్న వాటిలో నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నాం. జీవో ప్రకారం ఉన్న వాటిలోనే సర్దుతాం. అంతే కానీ ప్రత్యేకంగా ఏమి లేదు.
 -ధర్మారెడ్డి, డీఎస్‌వో

మరిన్ని వార్తలు