పెయిడ్‌ ఆర్టిస్టులకు పేమెంట్‌ లేదు..

14 Sep, 2019 04:26 IST|Sakshi

రూ.10 వేలు ఇస్తామని పునరావాస కేంద్రానికి జనాన్ని తరలించిన ప్రతిపక్ష టీడీపీ నేతలు 

ఇస్తామన్న డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని పెయిడ్‌ ఆర్టిస్టుల ఆగ్రహం  

సాక్షి, గుంటూరు: ఇటీవల కృష్ణా నదికి వరదలొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటోంది. వరదలను రాజకీయం చేయడానికి ఏ సాకూ దొరకని ప్రతిపక్ష టీడీపీ కుతంత్రానికి తెరదీసింది. ఓ పెయిడ్‌ ఆర్టిస్టుని పట్టుకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయించింది. చివరకు ఆ ఆర్టిస్టులు జైలు పాలయ్యారు. తాజాగా గుంటూరు జిల్లా పల్నాడులోని ఆత్మకూరులో జరిగిన చిన్న వ్యక్తిగత ఘటనను భూతద్దంలో చూపించి, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేసి, భంగపడింది. జరిగిన సంఘటనే చిన్నది కావడంతో టీడీనీ నాటకానికి గ్రామస్తులు నో చెప్పారు. గుంటూరులోని పునరావాస కేంద్రానికి రావడానికి అంగీకరించలేదు. దీంతో పెయిడ్‌ ఆర్టిస్టులను రంగంలోకి దింపింది. అయితే, ఈ నాటకం పండలేదు. దీంతో ఆర్టిస్టులకు ఇస్తామన్న డబ్బులు ఎగ్గొట్టింది. దీంతో పనులు, కుటుం బాలను వదులుకొని వచ్చిన ఆ సామాన్యులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.

పల్నాడు ప్రాంతంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలను వైఎస్సార్‌సీపీ నాయకులు వేధిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. బాధితుల కోసమంటూ గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొదటి మూడు రోజులు పునరావాస కేంద్రానికి పెద్దగా జనం రాలేదు. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇస్తామని చెబుతూ గ్రామాల్లో వ్యక్తిగత సమస్యలు, కుటుంబ గొడవలు ఉన్నవారిని పునరావాస కేంద్రానికి తరలించారు. పిన్నెల్లి, ఆత్మకూరులో 125 మంది ఎస్సీలను వైఎస్సార్‌సీపీ నాయకులు దాడి చేసి, వెళ్లగొట్టారని చంద్రబాబు ప్రచారం చేశారు. వాస్తవానికి పునరావాస కేంద్రంలో పిన్నెల్లి గ్రామం నుంచి వచ్చిన నలుగురు, ఆత్మకూరు నుంచి వచ్చిన 64 మంది మాత్రమే ఉన్నారు. వీరు కూడా కుటుంబ సమస్యలు, టీడీపీ నేతలు ఇస్తామన్న డబ్బుకు ఆశపడి వచ్చినవారే. పెయిడ్‌ ఆర్టిస్టులతో వారం రోజులు నడిపిన పునరావాస నాటకం ముగిసింది. కానీ, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో పునరావాస కేంద్రం నుంచి వట్టి చేతులతో వెను తిరిగిన వారు తిట్టిపోస్తున్నారు. టీడీపీ నాయకులు  నమ్మించి మోసం చేశారని మండిపడుతున్నారు. 

బయటకు రానివ్వలేదు
నాయకులను చూద్దామని పునరావాస కేంద్రానికి వెళ్లాను. నాపై ఎలాంటి కేసులు లేవు. నేను పునరావాస కేంద్రానికి వెళ్లి, తిరిగి వచ్చే సమయానికి పొద్దుపోయింది. మరుసటి రోజు వెళ్దాంలే అని అక్కడే పడుకున్నా. మరుసటి రోజు పొద్దున్నే మా గ్రామానికి వెళ్దామని బయల్దేరుతుండగా బయటకు రానివ్వకుండా గేట్లు వేసేశారు.    
– నరసింహారావు, పిడుగురాళ్ల 

డబ్బులివ్వకుండా మోసం చేశారు 
ఆసుపత్రిలో పని ఉంటే గుంటూరు వెళ్లాను. పునరావాస కేంద్రంలో ఉన్న నా స్నేహితుడు ఫోన్‌ చేసి భోజనాలు పెడుతున్నారని చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లాను. భోజనం చేశాక ఇక్కడే ఉంటే డబ్బులు ఇస్తామన్నారు. అక్కడే ఉన్నా టీడీపీ నేతలు మాకు ఇస్తామన్న రూ.10 వేలు ఇవ్వకుండా మోసం చేశారు.
    – కొమ్ము ఏసుబాబు, పిన్నెల్లి గ్రామం

మరిన్ని వార్తలు