ఆఖరి పోరాటం

31 Jul, 2013 04:08 IST|Sakshi
జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌లోని  20 మండలాల్లోని  293 పంచాయతీల్లో బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సర్పంచ్‌ల బరిలో 798 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 2,632 వార్డు పదవులకు 5,741 మంది బరిలో నిలిచారు. డివిజన్‌లోని 7,87,619 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం 2,642 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
 
 ఆఖరి దశలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు గెలుచుకుని ఫలితాల్లో ముందుండాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావుకు పంచాయతీ ఎన్నికలు సవాలుగా మారగా, మంత్రి కాసు కృష్ణారెడ్డికి ప్రతిష్టాత్మకమయ్యాయి.  దీనికితోడు మొదటి రెండు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంది. తన నియోజకవర్గంలోని అధిక గ్రామాలను కైవసం చేసుకుంటేనే తన పరువు నిలబడే పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు ఉండటంతో ఈ డివిజన్‌లో ఎన్నికల సరళి ఎలా ఉంటుందోనన్నది ఆసక్తిగా మారింది. ఎన్నికల్లో ఏ పార్టీది ఆధిక్యం అనేది మూడో దశ ఎన్నికల ఫలితాల తర్వాతే స్పష్టం కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ గ్రామ పంచాయతీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు తమ అభ్యర్థుల్ని గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు. 
 
 భారీగా మద్యం, డబ్బు పంపిణీ...
 నరసరావుపేట, పల్నాడు ప్రాంతాల్లో నేడు జరగనున్న తుది విడత ఎన్నికలను అన్ని పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఒక్కొక్క గ్రామపంచాయతీలో ఒక్కొక్క పార్టీ అభ్యర్థి 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి ఎన్నికలు ముగిసే వరకు కేవలం 20 లక్షల రూపాయల మద్యాన్ని ఓటర్లకు పంపిణీ చేసినట్టు అంచనా. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడంతో పాటు లెక్కింపు కేంద్రాల్లో కూడా ఫలితాలను తారు మారు చేసేందుకు మంత్రుల నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరించి పారదర్శకంగా ప్రశాంతం వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఓటర్లు కోరుతున్నారు.
 
 తుది విడతకు భారీ బందోబస్తు
 నరసరావుపేట, పల్నాడు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. నరసరావుపేట, గురజాల పోలీస్‌సబ్ డివిజన్ పరిధిలోని 20 మండలాలకు  భారీ బందోబస్తు నిమిత్తం 17 మంది డీఎస్పీలు, 90 మంది సీఐలు, 150 మంది ఎస్‌ఐలు, 350 మంది హెడ్‌కానిస్టేబుళ్లతో పాటు 4,000 మంది కార్గోఫోర్స్, పారామిలటరీ, సీఆర్‌పీఎఫ్ బలగాలు, కర్ణాటక రిజర్వు స్పెషల్ సిబ్బందికి విధులు కేటాయించామన్నారు.
 
 స్వేచ్ఛగా ఓటేయండి : కలెక్టర్ 
నరసరావుపేట డివిజన్‌లోని 293 గ్రామాల్లో బుధవారం జరిగే పోలింగ్‌లో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించు కోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సురేశ్‌కుమార్ సూచించారు. డివిజన్‌లో మొత్తం 3,226 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామనీ, 7 వేలమందికి పైగా పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నాయన్నారు. ప్రశాంతంగా పోలింగ్ ముగిసేందుకు ఓటర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు.
 
మరిన్ని వార్తలు