ఇదో ‘పార్సిల్ డబ్బా’ మోసం

24 Oct, 2013 02:05 IST|Sakshi

కేసముద్రం, న్యూస్‌లైన్ : డ్రాలో గెలిచావంటూ ఓ యువకుడికి గుర్తుతెలియని మోసగాడు మందులు, చాక్‌పీసులతో కూడిన పార్సిల్ డబ్బాను పంపి, తన ఖాతాలో రూ.5 వేలు జమ చేయిం చుకుని మోసగించిన సంఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది.  బాధితుడి కథనం ప్రకారం.. కేసముద్రం స్టేషన్ శివారు కట్టుకాల్వ తండాకు చెందిన భుక్యా నరేష్ తన భార్యకు అనారోగ్యంగా ఉండడంతో నెలకొకసారి ఎంజీఎం ఆస్పత్రిలో ఆయుర్వేద మందులు తీసుకొస్తుంటాడు. పదిరోజుల క్రితం ఓ వ్యక్తి 09939141718 నంబర్ నుంచి ఇతడి సెల్‌కు ఫోన్ చేస్తూ నీవు ఆయుర్వేద మందులు తీసుకున్నందున డ్రా తీశామని ఇందులో నీ పేరు వచ్చిందన్నారు.

ఇందుకుగాను నువ్వు రూ.5 వేలు పోస్టాఫీసులో  చెల్లిస్తే నీకు రూ.75 వేలు, 10 గ్రాముల బంగా రం, ఒక సెల్‌ఫోన్ పార్సిల్‌లో వస్తుందని తెలిపాడు. మొదట నమ్మలో? వద్దో తెలియ ని వ్యక్తి రెండురోజులుగా నీకు పార్సిల్ పంపించాను తీసుకోలేదా అని మళ్లీ అడిగాడు. దీంతో నమ్మిన నరేష్ వెంటనే అప్పుగా రూ.5 వేలు తెచ్చి మరీ పోస్టాఫీసుకు వెళ్లాడు. అక్కడ విచారించగా సిబ్బంది అతడి పార్సిల్‌ను తీసుకొచ్చారు. దీనిపై రూ.5 వేలు చెల్లించాల్సి ఉంది.. చెల్లించాకే తీసుకెళ్లు అని చెప్పడంతో అతడు చేతిలో ఉన్న డబ్బును ఇచ్చేశాడు.

ఎంతో ఆశతో ఆ డబ్బాను ఇంటికి తీసుకొచ్చి తెరిచి చూస్తే పాతబడ్డ మందులు, కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు కనిపించడంతో అతడు ఒక్కసారి లబోదిబోమన్నాడు. చివరకు మళ్లీ పోస్టాఫీసు వద్దకు వెళితే తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కాగా ఇంకా మరికొన్ని పార్సిల్ డబ్బాలు పోస్టాఫీసులో ఉండడం కొసమెరుపు.
 

మరిన్ని వార్తలు