బైక్‌ను అటకాయించి దంపతులపై దాడి

4 Oct, 2013 03:18 IST|Sakshi

అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నగర శివారుల్లో దోపిడీ ముఠాలు విజృంభిస్తున్నాయి. ఒంటరి వ్యక్తులపై దాడులు చేయడం, వాహనదారులను అటకాయించి దోచుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా రూరల్ పరిధిలోని వడ్డుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న కృష్ణవేణి, బాలకృష్ణ దంపతులను అటకాయించి బంగారు నగలను దోచుకెళ్లారు. బాధితులు రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కోణాపురానికి చెందిన దంపతులు, మంగళవారం వ్యక్తిగత పని నిమిత్తం నగరానికి వచ్చారు. బుధవారం సాయంత్రం బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. వడ్డుపల్లి గ్రామ సమీపంలో వెళుతుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వారిని ఆపారు. వాహనం వేగాన్ని తగ్గించగానే దుండగులు ఆ దంపతులపై దాడి చేశారు.
 
 కృష్ణవేణి మెడలోని పుస్తెలతో పాటు బంగారు గొలుసులు(ఆరు తులాలు బంగారు) లాక్కుని ఉడాయించారు. నిర్మానుష్య ప్రదేశంలో వారి అరుపులు అరణ్య రోదనగానే మిగిలాయి. దుండగులు ద్విచక్ర వాహనాల్లో వెళ్లి పోయినట్లు బాధితులు తె లిపారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, అటుగా వెళుతున్న వాహనదారుల సాయంతో బాధిత దంపతులు నగరానికి చేరుకున్నారు.
 
 స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసి స్వగ్రామానికి వెళ్లారు. ఇటీవల కక్కలపల్లి క్రాస్‌లో ద్విచక్ర వాహనదారుడిపై కత్తితో దాడి చేసి వాహనంతో సహా సెల్ ఫోన్, నగదు అపహరించుకు వెళ్లిన ఘటన మరవకనే, నేషనల్ పార్కు సమీపంలో జాతీయ రహ దారిపై దంపతులపై దాడి చేసిన జరగడం నగర వాసుల్ని ఆందోళనకు గురి చేసింది. తాజాగా వడ్డుపల్లి సమీపంలో దంపతులను దోచుకోవడంతో ఉలికి పడ్డారు.

మరిన్ని వార్తలు