ఆ ఐదుగురూ స్పెషల్

12 Sep, 2015 00:47 IST|Sakshi
ఆ ఐదుగురూ స్పెషల్

జిల్లాలో కీలక నేత హుకుం
పాఠాలు చెప్పకున్నా ఎస్‌వోలుగా నియమించిన విద్యాశాఖ
నిర్భీతిగా నిబంధనోల్లంఘన

 
విశాఖపట్నం: ‘ఆ ఐదుగురు టీచర్లు మా వాళ్లు. పాఠాలు చెప్పరు. వారిని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లుగా నియమించండి. విద్యా హక్కు చట్టం అంటూ రూల్స్ చెప్పొద్దు...అవన్నీ మాకు అనవసరం. ఎస్‌వోలుగా పోస్టింగులు ఇవ్వాల్సిందే’. ఇదీ జిల్లాకు చెందిన ఓ కీలక నేత హుకుం. విద్యాహక్కు చట్టం అమలును పర్యవేక్షించాల్సిన కీలన నేత ఆయనే ఆ చట్టాన్ని అపహాస్యం పాలు చేశారు.  విద్యాశాఖలో అప్రతిహాతంగా సాగుతున్న అవినీతిపర్వంలో మరో అంకం ఇది. ఐదుగురు ఉపాధ్యాయులను కేజీబీవీ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నగా పాఠాశాలకు వెళ్లకుండా కాలం వెళ్లదీస్తున్న ఆ ఐదుగురు ఉపాధ్యాయులు చివరికి అనుకున్నది సాధించారు.

ఏం జరిగిందంటే..: 2013వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులనే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ)లలో ప్రత్యేక అధికారులుగా నియమించేవారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని సుప్రీంకోర్టు 2013లో తీర్పునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ ప్రత్యేక అధికారులుగా ఉన్న ఉపాధ్యాయులను వారివారి పాఠశాలలకు పంపించి వేసింది. బీఈడీ చేసిన అభ్యర్థులను ప్రత్యేక పరీక్ష  ద్వారా కాంట్రాక్టు విధానంలో ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో కూడా 29మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఉండేవారు. వారిలో 24మంది ఉపాధ్యాయులుగా చేరిపోయారు. ఐదుగురు మాత్రం ప్రభుత్వ నిర్ణయంతో విభేదించారు. ప్రత్యేక అధికారులుగా కొనసాగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధమవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2014 ఏప్రిల్‌లో ఓ తీర్పులో విద్యా సంవత్సరం ముగిసిన తరువాత కొత్తగా ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పింది. ఆ ప్రకారం 2014, ఏప్రిల్ 22 తరువాత ఆ ఐదుగురిని ప్రత్యేక అధికారులుగా కొనసాగించడానికి వీల్లేదు. కొత్తవారిని నియమించాలి. కానీ... అలా చేయలేదు.

 మా వాళ్లనే కొనసాగించండి
 ఆ ఐదుగురు ఉపాధ్యాయులు తాము పాఠశాలకు వెళ్లి విద్యాబోధన చేసేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఏడాదిన్నరగా ఇటు ప్రత్యేక అధికారులుగా లేరు... మరోవైపు ఉపాధ్యాయులుగా కాకుండా విధులు నిర్వర్తించడం లేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఆ ఐదుగురూ కీలక సమీప బంధువును సంప్రదించారు. ‘డీల్’ కుదురడంతో ఆయన కీలక నేత ద్వారా కథ నడిపారు. కీలక నేత హైదరాబాద్‌లోని విద్యాశాఖ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. ఆ ఐదురుగిరినీ ప్రత్యేక అధికారులుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. అది విద్యాహక్కు చట్టానికి విరద్ధమని చెప్పినా ఆయన వినిపించుకోలేదు.‘ వాళ్లు మా వాళ్లు. ఇప్పుడు పాఠాలు చెప్పరు. ప్రత్యేక అధికారులుగా ఉంటారని చెప్పేశారు. దాంతో వారు కేజీబీఎస్ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
 
 

మరిన్ని వార్తలు