క్షీణించిన తోట వాణి ఆరోగ్యం

15 Aug, 2013 18:18 IST|Sakshi

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండుతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తోట వాణి ఆరోగ్యం క్షీణించింది. రాష్ట్ర మంత్రి తోట నరసింహం భార్య అయిన వాణి గత ఆరు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ఆమె శరీరంలో సోడియం స్థాయి గణనీయంగా పడిపోయిందని, రక్తపోటు పెరిగి మధుమేహం స్థాయి కూడా పడిపోయిందని కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ వెంకట బుద్ధ తెలిపారు. గురువారం దీక్ష విరమించకపోతే ఆమె ఆరోగ్యం బాగా విషమించే ప్రమాదమున్నట్లు ఆయన వివరించారు.

తోట వాణి ఆరోగ్యం క్షీణించిన విషయం తెలియడంతో కాకినాడలో మంత్రి అనుచరులు ప్రధాన రహదారులన్నింటినీ దిగ్బంధించారు. భానుగుడి సెంటర్కు దారితీసే దారులన్నింటినీ దాదాపుగా మూయించారు. కార్యకర్తలు వీధులన్నింటిలో మోటారు సైకిళ్లపై తిరుగుతూ దుకాణాలు, సినిమా థియేటర్లను మూయించారు. ఒక మహిళ ఇన్నాళ్లుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదంటూ సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాణి దీక్ష నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు సుమారు 50 మంది పోలీసులు కీలక ప్రాంతాల్లో ఉన్నారు. గురువారం రాత్రి ఏదో ఒక సమయంలో తోట వాణిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు