తోటపల్లి ప్రాజెక్టు షాక్

7 Feb, 2016 17:09 IST|Sakshi

 తోటపల్లి ప్రాజెక్టును రూపకల్పన చేసిన ఇంజినీరింగ్ అధికారులు దిగువున ఉన్న సాయన్న చానల్, నారాయణపురం ఆనకట్టతోపాటు పలుచోట్ల ఓపెన్‌హెడ్ రెగ్యులేటర్లను మర్చిపోయారు. సుమారు 49 వేల ఎకరాల ను సస్యశ్యామలం చేయాల్సిన నాగావళి నది డిసెంబర్ నాటికే నిర్జీవంగా మారుతుంది. సాగునీటి పరిస్థితి అటుంచితే నదీ తీర గ్రామాల్లోని బోరుబావులు సైతం  ఎండిపోతున్నాయి. ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.  సాయన్న చానల్ పరిస్థితి ఏమిటి ?  రేగిడి మండలం సంకిలి వద్ద నాగావళి నదిపై 50 ఏళ్ల క్రితంసాయన్న చానల్ ఓపెన్ హెడ్ రెగ్యులేటర్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా రేగిడి, సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం మండలాల్లోని 12,000 ఎకరాలకు ఖరీఫ్, రబీ పంటలకు సాగునీరు పుష్కలంగా అందేది. ప్రాజెక్టు కారణంగా ఈ ఏడాది నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. ప్రస్తుతం నది ఏడారిని తలపిస్తోంది.
 
 ఇదీ నారాయణపురం ఆనకట్ట కథ

  సంతకవిటి మండలం రంగారాయపురం గ్రామం వద్ద 60 ఏళ్ల క్రితం నిర్మించిన నారాయణపురం ఆనకట్ట ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. కుడి కాలువ ద్వారా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని 18,600 ఎకరాలు, ఎడవ కాలువ ద్వారా బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లోని 18,700 ఎకరాలను సస్యశ్యామలం చేసేది. తోటపల్లి పుణ్యమా అని రెండు కాలువలకు సాగునీరు అందడం గగనంగా మారింది. రబీని పక్కన పెడితే ఈ ఏడాది ఖరీఫ్‌లోనే రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారు. భవిష్యత్‌లో ఈ ఆనకట్ట రూపురేఖలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. నాగావళి నదీ తీరంలో వ్యవసాయ పంపుసెట్లుతోపాటు బోరు బావులు అడుగంటిపోయే ప్రమాదం ఉంది.

 ప్రాజెక్టు పరిస్థితి ఇది..
ప్రస్తుతం ప్రాజెక్టులో 2.5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. గరిష్ట నీటి మట్టం 105 మీటర్లు. వర్షాకాలంలో ప్రొజెక్టులోకి నాగావళి ద్వారా 15 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తుందని ఇరిగేషన్ అధికారులు అంచనా. ఆ సమయంలో మాత్రమే 5 వేల నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడతామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు మాత్రమే. 150 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడి చిపెడుతున్నామని చెప్పారు. ఫలితంగా సంకిలి వద్ద నాగావళి నదిలో నీరులేక సాయన్నచానల్ రెగ్యులేటర్‌కు అందడం లేదు. ఇక్కడ ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. నారాయణపురం ఆనకట్ట ఎత్తు కేవలం ఆరు అడుగులు మాత్రమే. ఇక్కడ వేసవిలో కూడా క నీసం మూడు అడుగుల నీరు నిల్వ ఉండాలి. అప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల్లో 150 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈ ఆనకట్ట కింద ఆయకట్టుకు ఖరీఫ్‌లో కూడా సాగునీరు అందలేదు. దీంతో మడ్డువలస ప్రొజెక్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు