మూడున్నర అడుగులవారు 'ఏడడుగులు' వేశారు

17 Feb, 2014 13:28 IST|Sakshi
మూడున్నర అడుగులవారు 'ఏడడుగులు' వేశారు

ఆత్రేయపురం : మూడు పదుల వయస్సు దాటినా వారి ఎత్తు మూడున్నర అడుగులు దాటలేదు... కానీ, వారిద్దరి మనసులు మాత్రం ఎల్లలు దాటాయి. ఎత్తుతో సంబంధం లేదంటూ ఏడడుగులతో ఒక్కటయ్యారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురానికి చెందిన రుద్రరాజు శ్రీనివాసరాజు (33) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. మూడున్నర అడుగులు మాత్రమే ఎదిగిన అతడు తనకు పిల్ల దొరకడం కష్టమే అనుకున్నాడు. ఆ తరుణంలో అంతే ఎత్తు గల వాడపల్లికి చెందిన కొండా రత్నం (30) తారసపడింది.

వసంతమే లేదనుకున్న బతుకుల్లో వలపు మొగ్గ తొడిగింది. కులాలు వేరైనా మనసులు ఒకటయ్యారు. ఇరువైపుల పెద్దలూ వారి అభీష్టాన్ని మన్నించి శనివారం సాయంత్రం వాడపల్లి వెంకటేశ్వరాలయంలో పెళ్లి చేశారు. వారిద్దరూ కొంగులు ముడి వేసుకుని, బుడిబుడి పాదాలతో ఏడడుగులు నడుస్తుంటే... బంధుమిత్రులకు 'బొమ్మల పెళ్లి' చూస్తున్నట్లు ముచ్చటపడ్డారు.

మరిన్ని వార్తలు