ప్రాణాలు తీసిన ‘బంగారు’ కలలు

15 May, 2020 05:16 IST|Sakshi

కేజీఎఫ్‌ బంగారు గనుల్లో చోరీకి యత్నం

ఊపిరాడక ముగ్గురి మృతి 

కుప్పం (చిత్తూరు జిల్లా)/కేజీఎఫ్‌: చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం, కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో బుధవారం రాత్రి ఆరుగురు చోరీకి ప్రయత్నించగా వారిలో ముగ్గురు మృతి చెందారు. కేజీఎఫ్‌ పదేళ్ల క్రితం మూతపడింది. అప్పటి నుంచి బంగారు గనుల్లో పనులు జరగకపోవడంతో భద్రతా సిబ్బందిని నియమించారు. గనుల్లో బుధవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు చోరీ యత్నానికి పాల్పడ్డారు. రాత్రి వేళల్లో బంగారు ఖనిజాలు కనిపిస్తాయని అపోహతో కేజీఎఫ్‌కు చెందిన జోసెఫ్‌ డిసౌజా (35), పడియప్ప (22), కంద (50), విక్టర్, కార్తీక్, రిచర్డ్‌లు గనుల్లోపలికి ప్రవేశించారు. వీరిలో ఊపిరాడక జోసెఫ్‌ డిసోజా, పడియప్ప, కంద మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. 20 మందికి పైగా ఫైర్, పోలీసులు బుధవారం రాత్రంతా గాలించి 400 అడుగుల లోతున ఉన్న కంద, జోసెఫ్‌ డిసౌజా మృతదేహాలను వెలికితీశారు. పడియప్ప మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు కార్తీక్, విక్టర్‌లను అరెస్టు చేశారు. మరో నిందితుడు రిచర్డ్‌ పరారీలో ఉన్నాడు. 

మృతులు జోసెఫ్, పడియప్ప, కంద

మరిన్ని వార్తలు