రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

5 Oct, 2014 02:46 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

అమరాపురం:
 స్థానిక తహశీల్దార్ కార్యాలయం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కుమారుడు రవికుమార్ మృతదేహాన్ని పట్టుకుని తల్లి రంగమ్మ  ‘ఇంటి నుంచి ఇప్పుడే వచ్చావు... ఇంతలోనే మృత్యువు కబళించిదా... లేరా రవీ’ అంటూ గుండెలవిసేలా రోదిస్తుంటే అక్కడున్న ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టారు. ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు... శుక్రవారం రాత్రి కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా కళారాజనపల్లి గ్రామానికి చెందిన రంగనాథ్(33), భార్య భాగ్యమ్మ, కుమారుడు సందీప్(4)తో కలిసి స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై చెల్లూరు గ్రామానికి బయలు దేరారు. అమరాపురం తహశీల్దార్ కార్యాలయ సమీపంలో ఎదురుగా మరో ద్విచక్రవాహనంపై వస్తున్న రవికుమార్(23), మహేష్‌లను వారి వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రంగనాథ్, రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.

 ప్రమాదంలో గాయపడిన భాగ్య మ్మ, ఆమె కుమారుడు సందీప్‌లను స్థానిక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం మడకశిర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సందీప్ మృతి చెందాడు. ప్రమాద సమాచారం దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. రంగనాథ్ కుటుంబ సమేతంగా బంధువుల ఊరికి వెళ్లడానికి వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని రోదించారు. రంగనాథ్‌కు కుమారునితోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో ఆడపిల్లలు అనాథలయ్యారని వారి గ్రామస్తులు ఆవేదన చెందారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ లింగన్న సిబ్బందితో అక్కడకు చేరుకుని ప్రమాదం జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రంగనాథ్ భార్య భాగ్యమ్మ పరిస్థితి కూడా విషమంగా ఉందని, ఆమె తుమకూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు.


 

మరిన్ని వార్తలు