మంత్రాలయంలో ముగ్గురి బలవన్మరణం

27 Mar, 2017 01:34 IST|Sakshi
మంత్రాలయంలో ముగ్గురి బలవన్మరణం

శ్రీమఠం వసతి గృహంలో ఫ్యానుకు ఉరేసుకున్న పాండిచ్చేరి వాసులు

మంత్రాలయం: ఏ కష్టం వచ్చిందో.. ప్రాంతంగాని ప్రాంతానికి వచ్చి వారు ప్రాణాలు తీసుకున్నారు.తమకు ఎవరూ లేరని.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నామని.. పవిత్ర మంత్రాలయంలోనే అంత్యక్రియలు చేయాలని తమిళంలో లేఖ రాసి మరీ బలవన్మరణం పొందారు. అన్నా, చెల్లి.. చెల్లికూతురు కలసి ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీమఠం వసతి గృహంలో చోటుచేసుకుంది. పాండిచ్చేరికి చెందిన శరవణ్‌(42), చెల్లెలు శాంతి (28), చెల్లెలి కూతురు పవిత్ర (13) ఈనెల 21న మంగళవారం.. మంత్రాలయం వచ్చారు.  విజయేంద్ర వసతి గృహంలో ఓ గదిని తీసుకున్నారు.

మరో రెండు రోజులకు రెన్యూవల్‌ చేయించుకున్నారు. అయితే ఆదివారం ఉదయం వారున్న గది నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది మఠాధికారుల ద్వారా పోలీసులకు తెలిపారు.పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా శరవణ్, శాంతి ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని కనిపించారు. చిన్నారి పవిత్ర విగత జీవిగా పడి ఉంది.  పోలీసులకు తమిళంలో రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికింది.ఆర్థిక ఇబ్బందులతో తాము చనిపోతున్నామని.. పవిత్ర మంత్రాలయంలోనే అంత్యక్రియలు జరిపాలని  రాసినట్లు పోలీసులు వివరించారు. మృతుడికి సెల్‌ఫోన్‌ ఉన్నా.. అందులో నంబర్లు లేకుండా సిమ్‌కార్డును తొలగించారు. మరణించిన వారు లేఖలో పేర్కొన్న  మేరకు వారి అంత్యక్రియలు మంత్రాలయంలోనే నిర్వహించారు.

మరిన్ని వార్తలు