పిడుగు కాటు

10 Aug, 2015 00:25 IST|Sakshi
పిడుగు కాటు

డిగ్రీ విద్యార్థి దుర్మరణం
 పొలం పనులు చేస్తుండగా దుర్ఘటన

 
దేవరాపల్లి: పిడుగు పాటుకు విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం మండల కేంద్రం దేవరాపల్లి కొరుపోలు వారి కల్లాలు వద్ద చోటు చేసుకుంది.   గ్రామానికి చెందిన కొరుపోలు సింహాచలం నాయుడు (21) వర్షం కురుస్తున్నప్పటికీ వరినాట్లుకు అనుకూలంగా పారపని చేస్తున్నాడు. అకస్మాత్తుగా పిడుగు నేరుగా అతనిపై పడింది. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇతడు ప్రస్తుతం బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రామ్మూర్తి రెండేళ్లు క్రితం చనిపోవడంతో కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచాడు. ఇతనికి తల్లి దేముడమ్మ ఉంది. ఇప్పుడామె ఒంటరిదయింది.

దేవరాపల్లిలో విషాదం
అందరితో కలిసి మెలిసి ఉండే సింహాచలం నాయుడు పిడుగు పాటుకు మరణించాడని తెలియడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అతని మృతదేహాన్ని చూసేందుకు పీహెచ్‌సీకి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. తల్లి దేముడమ్మ, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పోస్టుమార్టానికి మృతదేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దేవరాపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు సందర్శించి కుటుంబీకులను ఓదార్చారు.
 

మరిన్ని వార్తలు