టిక్‌టాక్‌ మోజులో పడి యువతితో మహిళ జంప్‌..!

13 Dec, 2019 21:17 IST|Sakshi

బెంగళూరు మహిళ హస్తం

కర్నూలు జిల్లా ఆదోనిలో కలకలం

సాక్షి, కర్నూలు : టిక్‌టాక్‌ మోజు యువత పాలిట శాపంగా మారుతోంది. టిక్‌టాక్‌ ఉచ్చులో చిక్కుకున్న ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివాహిత అదృశ్యం వెనుక బెంగళూరుకు చెందిన ఆమె టిక్‌టాక్‌ స్నేహితురాలి హస్తం ఉందని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదోని పట్టణంలోని కిల్చిన్‌పేటకు చెందిన అర్చనకు కర్ణాటకలోని కొప్పళకు చెందిన రవితో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అర్చన చెల్లెలు లక్ష్మికి బెంగళూరుకు చెందిన వీరేష్‌తో పెళ్లయ్యింది. వీరేష్‌ అక్కడే ఓ పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నాడు. అదే పెట్రోల్‌ బంక్‌లో ఓ యువతి క్యాషియర్‌గా పని చేస్తోంది. ఆమె రెండు, మూడు సార్లు వీరేష్‌ ఇంటికి వచ్చి వెళ్లింది.

ఈ క్రమంలో సదరు యువతితో అర్చనకు ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అప్పటికే టిక్‌టాక్‌ మోజులో పడిన ఆ యువతి అర్చనను కూడా అందులోకి లాగింది. ఇరువురూ చాటింగ్‌ చేస్తూ, వీడియోలు తీసుకుని టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. వాటికి వచ్చినæ లైకులు, కామెంట్లు చూసుకుని మురిసిపోయేవారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేమంటూ ఇటీవల పరస్పరం చాటింగ్‌లో మాట్లాడుకున్నారు. నాలుగు రోజుల క్రితం బెంగళూరు యువతి పత్తికొండ వరకు రాగా.. అర్చన అక్కడికి వెళ్లి కలిసింది. ఇద్దరూ కలిసి బెంగళూరు వెళ్లినట్లు సెల్‌ఫోన్‌ లోకేషన్‌ ద్వారా గుర్తించామని బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు. తమ బంధువులు బెంగళూరు వెళ్లి, అర్చన కోసం ఆరా తీశారని, ఆమె తన వద్దకు రాలేదని ఆ యువతి బుకాయిస్తోందని ఆరోపించారు. అర్చన ఎక్కడ ఉందో తెలియడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ‘యువతి అదృశ్యం’ కేసు నమోదు చేశామని, అర్చనను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని డీఎస్పీ రామకృష్ణ చెప్పారు.

  

మరిన్ని వార్తలు