పిడుగుపాటుకు చీలిన తిరుమల ఘాట్‌ రోడ్డు

14 Aug, 2017 03:06 IST|Sakshi
పిడుగుపాటుకు చీలిన తిరుమల ఘాట్‌ రోడ్డు
సాక్షి, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్‌లో పిడుగుపాటుకు రోడ్డు చీలింది. అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 40 మంది ప్రయాణికులతో ఆదివారం తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిగా వర్షం కురుస్తున్న సమయంలో బస్సుకు 20 మీటర్ల దూరంలో ఉదయం 7.50 గంటల సమయంలో రెండో కిలోమీటరు సూచికరాయి వద్ద భారీ శబ్దంతో పిడుగు పడింది. క్షణాల్లో  ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకోవటంతో అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపేశారు.

పొగ తగ్గిన తరువాత రోడ్డు చీలినట్టు గుర్తించిన డ్రైవర్‌ ఘాట్‌ రోడ్డు సిబ్బందికి సమాచారం అందించారు. ఘాట్‌ రోడ్డు ఇంజినీర్లు వెంటనే అక్కడకు చేరుకుని చీలిన రోడ్డును పరిశీలించారు. మూడు అంగుళాల మందం, ఆరు అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పు పరిమాణంలో రోడ్డు చీలినట్లు  గుర్తించారు. వర్షం కురుస్తుండటంతో ఆ ప్రాంతాన్ని మెత్తని ఎర్రమట్టితో నింపారు. 
మరిన్ని వార్తలు