'నీ అగ్రకుల దురహంకారాన్ని తగ్గించుకో'

16 Aug, 2017 13:47 IST|Sakshi
'నీ అగ్రకుల దురహంకారాన్ని తగ్గించుకో'
నంద్యాల: దళితులను కించపరిచిన మంత్రి నారాయణరెడ్డిని తక్షణమే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఆయన బుధవారం నంద్యాలలో మాట్లాడుతూ 'మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. దళితులకు మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలి. నువ్వెంత.. నీ చదువెంత.. నీకెందుకంత కావరం.. అంబెడ్కర్‌ కు ఎన్ని డిగ్రీలు ఉన్నాయె నీకు తెలుసా. దళితుల్లో ఉన్నత చదువులు చదివిన వారు వేల మంది ఉన్నారు. నీ అగ్రకుల దురహంకారాన్ని తగ్గించుకో' అని వరప్రసాద్ హెచ్చరించారు.
 
మరో నేత మేరుగ నాగార్జున మాట్లాడుతూ దళితుల శుభ్రత చదువుల గురించి ఆదినారాయణరెడ్డి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మంత్రి పదవులో ఉండి అనుచితంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు బాటలోనే ఆదినారాయణరెడ్డి వెళ్తున్నారని తెలిపారు. ఎస్సీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు అంటే.. ఎస్సీలు శుభ్రంగా ఉండరు.. చదువుకోరని మంత్రి అంటున్నారన్నారు. మంత్రి పదువులో ఉండి దళితులను కించపరిచిన ఆదినారాయణరెడ్డిని వెంటనే కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.