టీఎల్‌టీ ప్రాజెక్టుకు శంకుస్థాపన

21 Aug, 2015 21:54 IST|Sakshi

ఉక్కునగరం(విశాఖపట్నం): విశాఖ స్టీల్‌ప్లాంట్, పవర్‌గ్రిడ్‌లు సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్‌మిషన్ లైన్ టవర్స్(టిఎల్‌టి) ప్రాజెక్ట్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఆర్‌ఐఎన్‌ఎల్, పవర్‌గ్రిడ్ టీఎల్టీ ప్రైవేట్ లిమిటెడ్ 50:50 శాతం భాగస్వామ్యంలో టీఎల్టీ ఉత్పత్తిపై గతంలో ఎంఓయు చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి 1.20 లక్షల టన్నుల టీఎల్టీలను ఉత్పత్తి చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్ బిసి గేటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్ట్ పనులకు స్టీల్‌ప్లాంట్ సీఎండి పి.మధుసూదన్, పవర్ గ్రిడ్ సీఎండీ ఆర్.ఎన్.నాయక్‌లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉక్కు కంపెనీ సీఎండీ పి. మధుసూదన్ మాట్లాడుతూ ప్రస్తుత వాణిజ్య పరిస్థితుల్లో ఇటువంటి సంయుక్త భాగస్వామ్య సంస్థల ఏర్పాటు ఆవశ్యకమన్నారు.

ఈ ప్రాజెక్ట్ టీఎల్టీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పవర్‌గ్రిడ్ సీఎండీ నాయక్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ఏడాదిలోగా పూర్తయి ఉత్పత్తి ప్రారంభించడం ఇరుసంస్థలకు లాభదాయకమన్నారు. కార్యక్రమంలో ఉక్కు సంస్థ డైరెక్టర్లు పి.సి.మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, డి.ఎన్.రావు, సివిఓ బి. సిద్దార్దకుమార్, పవర్‌గ్రిడ్ డైరక్టర్లు ఐ.ఎస్.ఝా, ఆర్.పి. శశ్మాల్, మెకాన్ డైరక్టర్ దీపక్ దత్తా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు