మోడల్ స్కూల్‌లో ‘అత్తెసరు’

11 Feb, 2016 00:22 IST|Sakshi

పొందూరు: మండల పరిధిలోని వావిలపల్లిపేట సమీపంలో ఉన్న మోడల్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం బాగోలేకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. ఉడకని అన్నం పెట్టడంతో విద్యార్థులు పారబోశారు. కొంత మంది విద్యార్థులు కొంచెం అన్నం తిని అర్ధాకలితో ఉండిపోయారు. మరి కొంత మంది విద్యార్థులు పూర్తిగా అన్నం తినకుండా పారిబోసేశారు. ఆరు నుంచి పదో తరగతి వరకు 349 మంది విద్యార్థులు ఉండగా వారంతా బుధవారం ఆకలిని తట్టుకోలేకపోయారు. ఇలా పలుమార్లు ఉడకని అన్నం పెట్టడం, కూరలు బాగోలేకపోవడం, రుచిగా వండకపోవడం తదితర సమస్యలు ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతుండడంతో పలువురు విద్యార్థులు నేరుగా ఇంటి నుంచి మధ్యాహ్న భోజనాన్ని  తెచ్చుకొంటున్నారు.
 
 ఎన్ని సార్లు చెప్పినా మధ్యాహ్న భోజన నిర్వాహకుల్లో మార్పు రాలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సాంబారు, కూరలు బాగోలేవని వంట నిర్వాహకులను విద్యార్థులు పలుమార్లు ప్రశ్నిస్తే తింటున్న వారందరికి బాగుంది...మీకేనా బాగోలేదు అని కోపగించుకొనే వారని  చెప్పారు. బుధవారం మధ్యాహ్న భోజనం మరీ అధ్వానంగా ఉండడంతో ఆకలిని తట్టుకోలేని విద్యార్థులు  ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌కు బి.శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మళ్లీ అన్నం వండించారు. అప్పటికి సమయం 2.30 గంటలు అయింది. వంట నిర్వాహకులతో మాట్లాడగా కొత్త బియ్యం కావడంతో తేడా వచ్చిందని, దానిని గుర్తించలేకపోయామని చెప్పారు.
 
 అన్నం తినలేకపోతున్నాం...
 పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోవడం లేదు. ఎన్ని సార్లు చెప్పినా వంటలో మార్పు రాలేదు. సర్దుకుపోయి తింటుం డడంతో ఆరోగ్యం పాడైంది. దీంతో రోజూ పాఠశాలకు మధ్యాహ్న భోజనాన్ని ఇంటి నుంచి తెచ్చుకొంటున్నాను. మా స్నేహితులంతా ఈ రోజు ఆకలితో ఉన్నారు.        - కోరుకొండ రమ్యశ్రీ,
 తొమ్మిదో తరగతి.
 

మరిన్ని వార్తలు