శ్రీరాంసాగర్ వద్ద ఆహ్లాదం కరువు

3 Mar, 2014 03:35 IST|Sakshi

బాల్కొండ,న్యూస్‌లైన్ :  ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా చేపట్టిన పార్కు ఏర్పాటు పనులు నాలుగేళ్లకు పూర్తయ్యాయి. అయితే పార్కును ప్రారంభించి నెలన్నర కావస్తున్నా పర్యాటకులను లోకిని అనుమతించడం లేదు. దీంతో పార్కు పర్యాటకులకు ఆహ్లాదం పంచడం లేదు. కనీసం పార్కు గేటును కూడా తీయడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ భాగాన రూ. 6 కోట్ల నిధులతో ఇరిగేషన్ అధికారులు పార్కును ఏర్పాటు చేశారు. పార్కు పనులు పూర్తి కావడంతో గతేడాది డిసెంబర్ 29న రాష్ర్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పార్కును ప్రారంభించారు. అయితే ఆరోజు నుంచి పార్కును మాత్రం తెరవడం లేదు. పార్కును కాంట్రాక్టర్ల మేలు కోసం నిర్మించారా లేక పర్యాటకానికా అంటూ పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు.

 నిరాశ చెందుతున్న పర్యాటకులు...
 శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వస్తాయి. అప్పుడు ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదులుతారు. ఆ సమయంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏడాది పొడవునా ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు వస్తున్నారు. వసతులు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కు తెరవక పోవడంతో నిరాశతో వారంతా వెనుదిరి వె ళుతున్నారు.

 అధికారుల నిర్లక్ష్యం...
 పార్కులోకి ఇంత వరకు ఒక్క పర్యాటకుడిని కూడా అధికారులు అనుమతి లభించలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. ప్రాజెక్ట్ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పార్కు, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2009లో పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ పూర్తిచేసి పనులు ప్రారంభించారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు నాలుగేళ్లకు పూర్తిచేశారు.

ఆ తర్వాత పార్కు పర్యవే క్షణను సిబ్బందిని నియమించడం మరిచారు. ఉన్న ప్రాజెక్ట్ సంరక్షణకే సిబ్బంది దిక్కు లేదు. పార్కు పచ్చదనంతో కళకళలాడాలంటే ప్రతిరో జు కనీసం 20 మంది కూలీలు పనిచేయాలి. కాని ఒక్కరూ కూడా దిక్కులేరు.  ఏదైనా ఏజెన్సీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పట్టించుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు