ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమిద్దాం

8 Sep, 2014 23:50 IST|Sakshi

కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థను పరిరక్షణకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్‌లో ఆ సంఘం రీజినల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రస్తుతం కిష్ట పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. 1.25 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులకు జీవనోపాధి కల్పించిన సంస్థ ప్రస్తుతం రూ.3 వేల కోట్లు అప్పుల్లో ఉందని, ఈ సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు.
 
అయితే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు సాధించిన ఎంప్లాయీస్ యూనియన్, రీజియన్ స్థాయి గుర్తింపు పొందిన నేషనల్ మజ్దూర్ యూనియన్లు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. హడావిడిగా సమ్మెకు నోటీసులివ్వడం, ఎలాంటి హామీలు పరిష్కారం కాకుండానే ఆందోళన విరమించుకోవడం కార్మికుల పట్ల ఆ సంఘాలకు ఉన్న చిత్తుశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. కొందరు డిపో మేనేజర్లు, ఇతర అధికారులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, ఈ వైఖరిని మానుకోవాని కోరారు. సమస్యలను పరిష్కరించి సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో  పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఎస్.ఎస్. ప్రసాద్, కార్యదర్శులు శంకర్‌రెడ్డి, కె.ఎ.ఖాన్, ప్రచార కార్యదర్శి ఎం.వి. కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు