నేడే ఎంసెట్

22 May, 2014 02:22 IST|Sakshi
నేడే ఎంసెట్
  •     హాజరుకానున్న విద్యార్థులు 25,355 మంది
  •      నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
  •      బాల్‌పాయింట్ పెన్‌తోనే సమాధానాలు
  •      పరిశీలనకు ప్రత్యేక బృందాలు
  •  ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించనున్న ఎంసెట్-2014కు నగరంలో 25,355 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నగరంలో ఇంజినీరింగ్‌కు 36 కేంద్రాల్లో 18,976 మంది, మెడిసిన్‌కు 13 కేంద్రాల్లో 6,379 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రాంతీయ సమన్వయకర్త ఆచా ర్య కె.వెంకట సుబ్బయ్య తెలిపా రు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఇంజినీరింగ్‌కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు మెడిసిన్‌కు పరీక్ష జరగనుంది.
     
    నిరంతర పరిశీలన

    పరీక్షలకు నిరంతర పర్యవేక్షణ జరపనున్నారు. మెడిసిన్ పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షకుడు, నగరానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను ఏర్పాటు చేస్తున్నారు. మెడిసిన్ పరీక్ష కేంద్రాలకు అదనంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఉంటారు. ప్రతి 500 విద్యార్థులకు ఒక పరిశీలకుడిని, ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను గంట ముందుగా అనుమతిస్తారు. దరఖాస్తులో ఎటువంటి పొరపాట్లు దొర్లినా పరీక్ష కేంద్రంలో ఉండే నామినల్ రోల్స్‌లో సరిచేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్, గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ఆన్‌లైన్ దరఖాస్తు పత్రం కాపీని తీసుకురావాలి.
     
    పరీక్ష కేంద్రాలివే...
     
    నగరంలో ఇంజినీరింగ్‌కు సంబంధించి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల న్యూ క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, ఏయూ  ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ సైన్స్ కళాశాల, ఏయూ కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగం, ఏయూ సోషల్ సెన్సైస్ భవనం, ఏయూ ఆర్ట్స్ కళాశాల, ఏయూ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల, ఏయూ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-4( ఆర్ట్స్ అండ్ కామర్స్) డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-5 ( పీజీ కోర్సులు), డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్-6( పీజీ కోర్సులు), డాక్టర్ లంకపల్లి బుల్లయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాల, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య  కళాశాల బ్లాక్-2, ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాల, ప్రిజమ్ డిగ్రీ, పీజీ  కళాశాల, బీవీకే డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, పైడా కళాశాల, రెడ్నం గార్డెన్స్, శ్రీగౌరి డిగ్రీ, పీజీ కళాశాల, సెయింట్ మేరీస్ సెంటినరి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెయింట్ జోసఫ్స్ అటానమస్ కాలేజ్ ఫర్ ఉమెన్, బుద్ద రమేష్ బాబు డిగ్రీ, పీజీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్, వి.వి.ఆర్. కె.ఎం.ఎల్ డిగ్రీ కళాశాల, తాటిచెట్టపాలెం, డాక్టర్ వి.ఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సమతా కళాశాల, జీవీపీ డిగ్రీ కళాశాల, ఎస్.వి.వి.పి.వి.ఎం.సి.కళాశాల, విశాఖ వేలీ పాఠశాల, ఎస్‌వీపీ ఇంజినీరింగ్ కళాశాల, సాంకేతిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, సాంకేతిక పాలిటెక్నిక్ కళాశాల, బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు.

    మెడిసిన్‌కు...
    మెడిసిన్‌కు పైన పేర్కొన్న ఏయూలోని పది కేంద్రాలతో పాటు లంకపల్లి బుల్లయ్య కళాశాలలో రెండు కేంద్రాలు, వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ కళాశాలలో ఒక కేంద్రంలో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులూ ఇవి పాటించండి : పరీక్ష సమాధానాలు గుర్తించడంలో పెన్సిల్‌కు బదులు  నీలం, నలుపు బాల్‌పాయింట్ పెన్నును మాత్రమే వినియోగించాలి. విద్యార్థులు ఓఎంఆర్ పత్రంపై సమాధానాలు గుర్తించే సమయంలో ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాలి. తమ వెంట ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్ల్ తీసుకు రాకూడదు.
     
     ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి
     రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు సరిపడినన్ని ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు ఉన్నాయి. పూర్తి నమ్మకంతో, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాయండి. తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు మానసిక బలాన్ని అందించే విధంగా ఉండాలి. పూర్తి నమ్మకంతో పరీక్ష రాస్తే మంచి ఫలితాలు వస్తాయి.
     -ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు, ఉపకులపతి
     

మరిన్ని వార్తలు