- ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, 10.15 గంటలకు మండలి సమావేశం
- జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం భేటీ
సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం మంగళవారం రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఉదయం 9.45 గంటలకు అసెంబ్లీ, ఉదయం 10.15 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందుగానే శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం అయితే కేవలం జీఎస్టీ బిల్లును మాత్రమే ఆమోదించి అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించాలని నిర్ణయించింది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలపై కూడా చర్చించడానికి పట్టుబట్టనుంది. ప్రధానంగా మిర్చి రైతులు పడుతున్న కష్టాలను సభలో ప్రస్తావించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు.