అవగాహనే అసలు మందు

26 May, 2014 00:26 IST|Sakshi
అవగాహనే అసలు మందు

- థైరాయిడ్ బాధితుల్లో ఆడవారే అధికం
- అవగాహనతో వ్యాధి నియంత్రణ
- నేడు వరల్డ్ థైరాయిడ్ డే

న్యూస్‌లైన్, గుంటూరు మెడికల్, ఎంత తిన్నా లావుగా కాకపోవడం, కొందరు అధికంగా బరువు పెరగడం, అలసట, చర్మం ఎండిపోవడం.. ఇటువంటి లక్షణాలు ఉంటే  వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించడం మంచిదని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఎండ్రోకైనాలజిస్ట్ డాక్టర్ పతకమూరి పద్మలత తెలిపారు.  థైరాయిడ్ గ్రంథిపై చాలామందికి సరైన అవగాహన లేకపోవటంతో వ్యాధిని నియంత్రణలో పెట్టుకోలేక పోతున్నట్లు చెప్పారు. నేడు వరల్డ్ థైరాయిడ్ డే. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు ‘న్యూస్‌లైన్’కు వివరించారు.
 
థైరాయిడ్ గ్రంథి అంటే..
గొంతు ముందు భాగంలో శ్వాసనాళానికి ఇరుపక్కలా గులాబీ రంగులో ఇంచుమించు సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఇది 20గ్రాముల బరువు ఉండి శరీరంలోని  జీవక్రియలను నియంత్రిస్తుంది. శరరీం, ఎముకల పెరుగుదలను, ఉష్ణోగ్రతను, మానసిక వికాసాన్ని అదుపుచేస్తుంది. వివిధ కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ హార్మోను ఉత్పత్తికి మన శరీరంలో తగినంత అయోడిన్ అవసరం.  

థైరాయిడ్ లోపం వల్ల..
- థెరాయిడ్ లోపంతో హుషా రు తగ్గుతుంది. విపరీతమైన అలసట వస్తుంది. నడవాలన్నా , పనిచేయాలన్నా ఓపిక ఉండదు. చర్మం ఎండిపోయినట్లు ఉంటుంది.
- కండరాలు ఉబ్బుతాయి. మలబద్ధకం, కండరాలు పట్టివేసినట్లు ఉండటం, చర్మం కింద కొవ్వు చేరి బరువు పెరుగుతారు. గొంతు బొంగురుగా మారటంతో పాటు ముఖం గుండ్రంగా కనపడుతుంది.
- జీవక్రియ స్థాయి విపరీతంగా పెరిగి శరీరంలోని అన్ని శక్తి వనరులు ఖాళీ అవుతాయి. ఎముకల్లో క్యాల్షియం తక్కువై ఎముకలు పెలుసు బారతాయి. తలమీద వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి. ముఖ్యంగా కనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతాయి.
- పిల్లలో పెరుగుదల ఉండదు. స్త్రీల రుతుచక్రంలో మార్పులు రావటం, గర్భం రావటం ఆలస్యం అవ్వటం, తరచుగా గర్భస్రావాలు జరగటం తదితర లక్షణాలు ఉంటాయి.
 
వందలో పదిమందికి..
- ఈ వ్యాధి అప్పుడే పుట్టిన  బిడ్డ మొదలుకొని 90 ఏళ్ల వయస్సు వారికి వస్తుంది.
- జీజీహెచ్‌కు వైద్యం కోసం వచ్చే వారిలో 100 మందిలో పదిమంది ఈ వ్యాధి బాధితులే.
- మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా థైరాయిడ్ గ్రంథి సమస్య వస్తోంది. ఆడవారిలో 80శాతం మందికి ఉంటే మగవారిలో - - 20శాతం మందికి వస్తుంది. దీనికి జీవితాంతం మందులు వాడాలి.
- వ్యాధి సోకిన వారికి ఒక్కొక్కరిలో ఒక్కోవిధంగా లక్షణాలు ఉంటాయి.
- ఆహారంలో అయోడిన్ లోపం లేకుండా చూసుకోవటం వల్ల కొంతవరకు థైరాయిడ్ బారినపడకుండా కాపాడుకోవచ్చు.
- జన్యుపరలోపాల వల్ల, తల్లికి ఉంటే బిడ్డకు, వంశ పారంపర్యంగా ఈ వ్యాధి వస్తుంది.
- అప్పుడే పుట్టిన బిడ్డకు థైరాయిడ్ ఉందో లేదో నిర్ధారణ పరీక్ష చేయించటం చాలా ఉత్తమం.
                              డాక్టర్ పద్మలత, ఎండ్రోకైనాలజిస్ట్

మరిన్ని వార్తలు