విమానాశ్రయంలో హడావుడి పనులు

31 Dec, 2018 12:28 IST|Sakshi

నేడు ట్రయల్‌ రన్‌  

ఐదారుగురు మాత్రమే కూర్చునే విమానం రాక 

అసంపూర్తి పనులతో ప్రారంభిస్తుండటంపై విమర్శలు 

కర్నూలు(అగ్రికల్చర్‌): ఓర్వకల్లు విమానాశ్రయం అసంపూర్తి పనులతోనే ట్రయల్‌ రన్‌కు సిద్ధమైంది. కొంత వరకు రోడ్లు వేయడం మినహా ఎటువంటి పురోగతి లేదు. టెర్మినల్‌ ప్లాంట్, ప్రయాణికుల విశ్రాంతి భవనం, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సముదాయం తదితర పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కేవలం రన్‌వే, ఎప్రోచ్‌ రోడ్డు, విమానాల పార్కింగ్‌ మాత్రమే పూర్తి చేశారు. జనవరి 7వ తేదీన ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తున్న నేపథ్యంలో సోమవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్రయల్‌ రన్‌కు సెస్నా సైటేషన్‌ సీజే2    (CESSANA CITATION CJ2) మోడల్‌ విమానం ఓర్వకల్లుకు రానుంది. ఈ మోడల్‌ విమానం అతి చిన్నది. ఇందులో నలుగురు నుంచి ఆరుగురు మాత్రమే కూర్చునే అవకాశం ఉంది.

 ఉదయం 10.30 నుంచి 1.30 గంటల మధ్య ట్రైయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి కలెక్టర్‌ సత్య నారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొననున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో అరకొర పనులతోనే విమానం ట్రయల్‌ రన్, జనవరి 7న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సోమవారం ఓర్వకల్‌ విమానాశ్రయంలో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఆదివారం వందల మంది విమానాశ్రయం చూసేందుకు వచ్చారు. అక్కడ అరకొర పనులు చూసి విమానాశ్రయాన్ని ప్రారంభించినా రెగ్యులర్‌గా విమానాలు ఎగురడానికి చాలా కాలం పడుతుందని పలువురు 
చర్చించుకున్నారు.  

మరిన్ని వార్తలు