పెరుగుతున్న ధర రైతు బజార్లలో దొరకని వైనం
బహిరంగ మార్కెట్లో కిలో రూ.60
ఎంవీపీకాలనీ (విశాఖతూర్పు): ఒక్కసారిగా పెరిగిన ధరలతో టమాట ఠారెత్తిస్తుంటే..పచ్చిమిర్చి కొనకుండానే మంట పుట్టిస్తోంది. గత నెలలో రైతుబజార్లలో రూ.16 రూపాయలకు విక్రయించిన టమాట.. నేడు రూ.42లు, పచ్చిమిర్చి రూ.26 నుంచి ఒక్కసారిగా రూ.46లు ధర పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో ఏకంగా కిలో రూ.60లకు వియ్రిస్తున్నారు. దీంతో వినియోగదారులు టమాట, పచ్చిమిర్చికోసం రైతుబజార్లను ఆశ్రయిస్తున్నారు. అయితే డిమాండ్కు తగ్గసరుకు బజార్లలో అందుబాటులేక కొరత ఏర్పడింది. నరసింహనగర్ రైతుబజార్లో టమాట కొరత ఏర్పడింది. సాధారణంగా ఆదివారం రైతు బజార్కు వినియోగదారుల తాడికి ఎక్కువగా ఉంటుంది. డిమాండ్కి తగ్గ టమాటా సరఫరా లేక వచ్చిన కొద్దిపాటి సరకు ఉదయం 9:00 గంటలకే విక్రయించేశారు. ప్రతి ఆదివారం రైతుబజార్కు 120 నుంచి 140 క్రేట్లు సరుకు వస్తుంది. హోల్సేల్ మార్కెట్లో తగినంత సరుకు లేకపోవడం, ధర అధికంగా ఉండటంతో కేవలం 43 క్రేట్లే టమాట వచ్చింది. అదీ ఒక్క కౌంటర్లో విక్రయించడంతో రద్దీ నెలకొంది. 9 గంటల కల్లా టమాట విక్రయించేయడంతో ఆ తర్వాత వచ్చిన వారంతా నిరాసగా వెనుతిరిగారు. రైతుబజార్లో దేశవాళీ కిలో రూ.42లు, హైబ్రిడ్ రూ.38లకు విక్రయించారు, బహిరంగ మార్కెట్లో రూ.60ల ధర పలుకుతోంది. దీంతో వినియోగదారులు రైతుబజార్ను ఆశ్రయిస్తున్నారు. కానీ టమాట దొరక్క అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రైతు బజార్లలో క్యూ...
ఎంవీపీ రైతు బజార్లో టమాట విక్రయాలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా మార్కెట్లోకి టమాట విక్రయాలు అంతంత మాత్రంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రస్తుతం వేసవి కాలం కావడంతో రైతుల వద్ద పంట దిగుబడి నిలిచిపోయింది. గత కొన్ని రోజులుగా ఎంవీపీ రైతు బజార్లలో విక్రయాలు నామమాత్రంగా జరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాట కోసం గంటల తరబడి క్యూలో ఉండి వినియోగదారులు కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.