పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యం: అవంతి

26 Nov, 2019 13:29 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో పర్యాటక శాఖ అధ్వర్యంలో టూరిజం ఇన్వెస్టర్స్‌ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్సీ సోమువీర్రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో 45శాతం దేశాలు టూరిజం మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయని అన్నారు. అలాగే టూరిజానికి అవకాశం ఉన్న పలు ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి భద్రతకు ప్రాధాన్యం కల్పించాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు.

అలాగే ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. సీతానగరం మండలంలో ఉన్న రామవరపు ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అన్నారు. అలాగే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద రోప్‌వే ఏర్పాటు చేస్తే భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందరని,  దీంత టెంపుల్‌ టూరిజం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. స్టార్‌హోటల్‌లో మద్యం ధరలు అధికంగా ఉన్నందువల్ల టూరిజంపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీ సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్రేయపురం పరిధిలో ఉన్న పిచ్చుకలను 10కోట్లతో రిసార్ట్స్‌ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవచ్చనునని తెలిపారు.  

మరిన్ని వార్తలు