ఉల్లికిపాట్లు

21 Aug, 2015 23:50 IST|Sakshi
విశాఖ సీతమ్మధార రైతుబజార్‌లో ఉల్లి క్యూలోకి పరిగెడుతూ పడిపోయిన ఓ యువతి

కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
రైతుబజార్లలో బారులు తీరుతున్న ప్రజలు
రోజురోజుకూ ఎగబాకుతున్న ధర

 
విశాఖపట్నం: ఉల్లి కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. ధర సామాన్యులకు అందుబాటులో లేదు. దిగుబడి తగ్గిన నేపథ్యంలోకొంతమంది హోల్‌సేల్ వ్యాపారులు అనధికారికంగా నిల్వ చేస్తూ కృత్రిమ కొరత సృష్టించడంతో బహిరంగ మార్కెట్‌లో ఉల్లిధరలు అమాంతం పెరిగి పోతున్నాయి. సాధారణంగా రోజుకు జిల్లా వ్యాప్తంగా వంద మెట్రిక్ టన్నుల వరకు అవసరం ఉంటుంది. ఒక్క నగర పరిధి లోనే 60 నుంచి 80 మెట్రిక్ టన్నుల వరకు విక్రయాలు జరుగుతుంటాయి. జూన్ నెలాఖరు వరకు కిలో రూ.20 ఉన్న ఉల్లి ప్రస్తుతం  రైతుబజార్లలోనే రూ.50పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో మేలురకం కిలో రూ.70 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ తగ్గట్టుగా దిగుబడులు లేకపోవడంతో ధర ఆకాశానికి ఎగబాకింది. జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకున్నా కొంతమంది అక్రమార్కులు చేస్తున్న ఉల్లిదందా వల్ల ధరలు అదుపులోకి రావడం లేదు. కృత్రిమ కొరతను నివారించేందుకు దాడులు చేయాల్సిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు పత్తా లేకుండా ఉన్నారు. మెరుపు దాడులు కాదు కదా..కనీసం తనిఖీలు చేసిన పాపాన పోవడం లేదు.
 
ఇండెంట్‌కు తగ్గట్టుగా రాని ఉల్లి

 ప్రస్తుతం రోజుకు రెండులారీల ఉల్లి(40 ఎంటీలు)ను ర ప్పిస్తున్నారు. ఆదివారం 60 ఎంటీలు ..మిగిలిన రోజుల్లో 40ఎంటీల ఉల్లి అవసర మవుతాయంటూ మార్కెట్‌శాఖ ఇండెంట్ పెడుతున్నప్పటికీ ఆ స్థాయిలో లోడు రావడం లేదు. కర్నూల్‌లో ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు లోడు మరీ తగ్గిపోతుంది. గత వారం రోజులుగా ఇండెంట్‌కు తగ్గట్టుగా కర్నూల్ నుంచి లోడు రాకపోవడంతో రైతుబజార్లలో సైతం ఉల్లి కోసం సిగపట్లు పట్టాల్సి వస్తోంది. ప్రస్తుతం రోజుకు 25ఎంటీల నుంచి 30 ఎంటీల లోపే వస్తుందని చెబుతున్నారు.  రైతుబజార్లలో కొంతమంది కింద స్థాయి సిబ్బంది ఉల్లి హోల్‌సేల్ వ్యాపారులతో కుమ్మక్కై వచ్చిన సరుకును దారిమళ్లిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

 గ్రామీణ ప్రజలను పట్టని అధికారులు
 రైతుబజార్ల ద్వారామాత్రమే సబ్సిడీఉల్లి విక్రయించాలని సర్కార్ ఆదేశాలివ్వడం..మన జిల్లాలో నగర పరిధిలోనే రైతుబజార్లు ఉండడంతో సబ్సిడీ ఉల్లి విక్రయాలు పూర్తిగా నగర వాసులకే పరిమితమవుతున్నాయి.గ్రామీణ వాసులకు సబ్సిడీ ఉల్లి దొరకని పరిస్థి తి నెలకొంది. వారు బహిరంగ మార్కెట్‌లో రూ.50 నుంచి 70లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు