అందరూ ఉన్నా అనాథలయ్యారు..

4 Jul, 2020 04:38 IST|Sakshi

కర్నూలు, గుంటూరు జిల్లాల్లో హృదయవిదారక ఘటనలు 

డోన్‌ (కర్నూలు)/తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి): మరణానంతరం బంధువులు, స్నేహితులే ఆ నలుగురై కడపటి సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ కరోనా పుణ్యమా అని రాష్ట్రంలో ఇద్దరు వృద్ధులు ‘ఆ నలుగురి’కీ నోచుకోలేదు. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఉదంతాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 

అయినవారు ముందుకు రాకున్నా... 
► కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలోని పాతపేటకు చెందిన గురుప్రసాద్‌(60) అనారోగ్యంతో గురువారం రాత్రి ఇంట్లోనే మృతి చెందాడు. అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులతోపాటు బంధువులు వెనకడుగు వేశారు.  
► సమాచారం అందుకున్న ద్రోణాచలం సేవా సమితి ఆత్మబంధుమిత్ర సంస్థ ప్రతినిధులు ఆ ఇంటికి చేరుకుని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. 

కుటుంబ సభ్యులు రాకున్నా.. 
► గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ వృద్ధుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు మనవళ్లు. చిన్న కుమారుడు మెడికల్‌ షాపులో పనిచేస్తుండగా, అతనికి వారం క్రితం కరోనా సోకింది.  పరీక్షలు నిర్వహించగా.. తల్లి(వృద్ధుడి భార్య)కి పాజిటివ్‌ వచ్చింది. తల్లిని, కుమారుడిని ఐసోలేషన్‌కు, పెద్ద కోడలు, మనవళ్లను క్వారంటైన్‌కు తరలించారు.  
► వృద్ధుడికి పక్షవాతం రావడంతో తోడుగా ఆ ఇంట్లో పెద్ద కుమారుడున్నాడు. వృద్ధుడు గురువారం మరణించాడు. శుక్రవారం ఉదయం వరకు బంధువులెవరూ రాకపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. 
► తాడేపల్లిలోని వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ మహాప్రస్థానం వాహనాన్ని పిలిపించి  తండ్రి మృతదేహాన్ని ఎదురింటి మహిళ సాయంతో  వాహనం ఎక్కించాడు. మృతదేహాన్ని, ఆ యువకుడిని కరోనా పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు