పీఎస్‌ ఎదుట ట్రైనీ ఎస్సై భార్య ధర్నా

7 Feb, 2019 17:37 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురానికి తీసుకెళ్లడం లేదని పీఎస్‌ ఎదుట ధర్నాకు దిగింది ఓ ట్రైనీ ఎస్సై భార్య. ఈ ఘటన గుంటూరు జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు గుంటూరు పీఎస్‌ ఎదుట బైఠాయించారు. ఆమెను భర్త ఇంట్లోకి రానీవకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. తన పేరు లావణ్య అని, రేండేళ్ల క్రితం నెల్లూరు జిల్లా సంగంకు చెందిన నాగార్జున తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. పెళ్లి అయిన కొద్ది రోజులకే నాగార్జునకు ఎస్సై ఉద్యోగం వచ్చిందని, దీంతో ట్రైనింగ్‌ అంటూ రెండేళ్లుగా కాపురానికి తీసుకెళ్లలేదని వాపోయారు. ఎన్నిసార్లు అడిగిన ట్రైనింగ్‌ అంటూ తప్పించుకుతిరుగుతున్నారని చెప్పారు.

అచ్చంపేటలో పీఎస్‌లో ట్రైనింగ్‌ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలుసుకొని ఇక్కడకు వస్తే.. తీవ్రంగా కొట్టి ఇంటికి తాళం వేసుకొని పరారయ్యాడని ఆరోపించారు. ఉద్యోగం రావడంతో తనను వదిలించుకునేందుకు నాగార్జున ప్రయత్నిస్తునారని.. తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  తన భర్త వచ్చి తీసుకెళ్లే వరకు ఇక్కడి నుంచి  కదిలేది లేదని భీష్మించారు.

మరిన్ని వార్తలు