ఒడిశా నుంచి గంజాయి రవాణా

23 Mar, 2014 03:30 IST|Sakshi

సాలూరు/టౌన్, న్యూస్‌లైన్ :
 గంజాయి అక్రమ రవాణాకు ఎక్సైజ్ పోలీసులు చెక్ పెట్టారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రా మీదుగా కటక్‌కు రవాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి పాచిపెంట మండలం పి.కోనవలస వద్దనున్న ఎక్సైజ్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నా రు. అదే సమయంలో జైపూర్ నుంచి ఆంధ్రా సరిహద్దు మీదుగా కటక్ వెళ్తున్న బస్సును సోదా చేశారు.
 
బస్సు లో అక్రమంగా తరలిస్తున్న 21 కిలోల గంజాయిని చెక్‌పోస్ట్ సీఐ సతీష్‌కుమార్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నాలుగు మూటల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మూటలను తరలిస్తున్న నీలాంబర్‌కిలోతోపాటు అతని భార్య సైథీకిలో, కుమార్తె కలమాకిలో, సమీప బంధువు బల్లు సీసాలను అదుపులోకి తీసుకున్నారు.
 
వీరిది ఒడిశాలోని చిత్రకొండ పోలీస్‌స్టేషన్ పరి ధి గ్రామంగా గుర్తించామని సాలూరు ఎక్సైజ్ సీఐ ఎస్‌వీ రమణమూర్తి తెలిపారు. వీరు జైపూర్ నుంచి కటక్‌కు ఈ మూటలను తరలిస్తున్నారని, గంజాయి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
 
 బొడ్డవరలో 9.9 కిలోల స్వాధీనం
 శృంగవరపుకోట : ఆర్టీసీ బస్సులో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని స్థానిక ఎక్సైజ్ శాఖ సిబ్బంది శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. ఎస్.కోట ఎక్సైజ్ సీఐ డి.గోపాలకృష్ణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల విధుల్లో భాగంగా బొడ్డవరలో ఏర్పాటు చేసిన ఔట్‌పోస్టు వద్ద హెచ్.సి రాముడు, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, జయరామ్‌నాయుడు వాహన తనిఖీ లు చేపడుతున్నారు.
 
 సాయంత్రం 6.30 గంటల సమయంలో కించుమండ నుంచి విశాఖ వెళ్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేశారు. బస్సులో ముగ్గురు వ్యక్తుల వద్ద ఉన్న రెండు సంచులను తనిఖీ చేయగా.. గంజాయి బయటపడింది. ఒక వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్‌లో 4.8 కిలోలు, మరొక వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్‌లో 5.1 కిలోల గంజాయి లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న సీఐ గోపాలకృష్ణ, ఎస్సై పద్మావతి అక్కడకు చేరుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, సరుకును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు పాల్పడ్డ వ్యక్తులు మహరాష్ట్ర థానే జిల్లాలో భీవాండి పట్టణానికి చెందిన అక్రముద్దీన్ షేక్, అబ్దుల్ ఖయామ్ అన్సారీ, సంజయ్ చంగ్లానీలుగా గుర్తించామని సీఐ చెప్పారు. వీరు రవాణా చేస్తున్న గంజాయి శీలావతి రకానికి  చెందినదని, దీని విలువ రూ.20 వేలు ఉంటుందని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు.
 
 వారపు సంతలే అడ్డాగా అక్రమ రవాణా
 కురుపాం : ఏజెన్సీలో నిర్వహిస్తున్న వారపు సంతలే అడ్డాగా కొంతమంది అక్రమార్కులు గంజాయిని అక్రమంగా తరలించేస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని మొండెంఖల్, నీల కంఠాపురం ఏజెన్సీ వారపు సంతల్లో అధిక మొత్తంలో గంజాయిని సేకరించి నీకలంఠాపురం సరిహద్దులు, శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మీదుగా మైదాన ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల నిఘా లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోతోంది. ఇదే అదునుగా అక్రమార్కులు దొంగనోట్ల చెలామణి కూడా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దొంగనోట్ల మార్పిడికి కూడా వారపు సంతల నే కేంద్రంగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు