‘ఎర్ర’ బంగారం ఇలా... ‘హద్దు’ దాటుతోంది!

1 May, 2015 05:54 IST|Sakshi

శేషాచలం కొండల నుంచి ఎర్రచందనం ఎలా సరిహద్దులు దాటుతుందో విచారణలో పోలీసులకు స్మగ్లరు వివరించినట్లు సమాచారం. చెన్నై కేంద్రంగా ఎర్రచందనం దుంగలను ముంబయి, కోల్‌కత్తా, కేరళ ప్రాంతాలకు సముద్రమార్గంలో త రలిస్తున్నారు. అక్కడి నుంచి సరిహద్దులోని భూటాన్, చైనా, నేపాల్ లాంటి దేశాలకు ట్రాన్స్‌పోర్టు ద్వారా అక్రమంగా చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు స్మగ్లర్లు నోరువిప్పినట్లు తెలిసింది.
- జిల్లా నుంచి ట్రాన్స్‌పోర్టర్ల ద్వారా ఎగుమతి
- పోలీసుల ఎదుట నోరు విప్పిన స్మగ్లర్లు
- షణ్ముగం ముఠాదే అతిపెద్ద స్మగ్లింగ్
- నాలుగేళ్లలో రూ.1400 కోట్ల సంపద అక్రమ రవాణా
- మిగిలిన స్మగ్లర్లు తరిలించింది ఎంతో?
చిత్తూరు (అర్బన్):
ఎర్రచందనం అక్రమ రవాణాలో  చెన్నై-బెంగళూరు ఆపరేషన్లలో కింగ్‌పిన్ షణ్ముగం, అతని అనుచరులు సౌందర్‌రాజన్, శరవణన్  బ్యాచ్‌లు నాలుగేళ్ల కాలంలో దాదాపు 700 మెట్రిక్ టన్నుల (7 లక్షల కిలోలు) ఎర్రచందనం దుంగలను దేశ సరిహద్దులు దాటించి విదేశాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇప్పటికే స్మగ్లర్లను న్యాయస్థానం అనుమతితో విచారిస్తున్న చిత్తూరు పోలీసులకు నిందితులు స్మగ్లింగ్‌కు ఎలా చేస్తారనేదానిపై పలు విషయాలు వెల్లడించారు. ఈ ముఠా ఇప్పటి వరకు తరలించిన 700 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విలువ దాదాపు రూ.1400 కోట్లు ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ లెక్కన మిగిలిన వేలాది మంది స్మగ్లర్లు ఎంత ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు..? వీటి విలువ ఎంత అనేది ఆలోచిస్తేనే జిల్లా నుంచి ఏ స్థాయిలో ఈ వ్యవహారం నడిచిందో అర్థమవుతోంది.

ఇలా సరిహద్దులు దాటిస్తారు...
చెన్నై-పశ్చిమ బెంగాల్ ఆపరేషన్‌లో రిమాండుకు తరలించిన నిందితులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో స్మగ్లర్లు ఎలా ఎర్ర సంపదను సరిహద్దులు దాటవేస్తారనే విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు .. తొలిగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరకడానికి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూలీలను ఎంపిక చేసుకుంటారు. ఈ కూలీలను ఒక గ్రూపునకు 50 నుంచి 100 మంది వరకు సరఫరా చేసే మేస్త్రీల ద్వారా కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. కూలీలు అడవుల్లోకి వచ్చి ఎర్రచందనం చెట్లను నరికి దానిని లోడింగ్ చేసి వెళ్లిపోతారు.

దుంగలతో ఉన్న లోడింగ్ వాహనానికి ఇద్దరు పెలైట్లు దారి చూపిస్తూ ముందుకు వెళుతారు. సమస్య అంతా జిల్లా సరిహద్దుల నుంచి సరుకు చెన్నైకి చేరుకునే వరకే. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్మగ్లర్లు ఇక్కడున్న కొందరు పోలీసు అధికారులకు నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చెన్నైకి చేరుకున్న సరుకును ఇక్కడ సొంతంగా ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ కలిగిన స్మగ్లర్లు వారి గోడౌన్లలో భద్రపరుస్తారు. ఒక్కో గోడౌన్‌కు సాధారణంగా నెలకు రూ.20 వేలు అద్దె ఉంటుంది.  స్మగ్లర్లు నెలకు రూ.60 వేలు అద్దె ఇస్తుండడంతో గోడౌన్లు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతోంది.

ఇలా వచ్చిన సరుకును బయ్యర్లకు చూపించి  పోర్టు ద్వారా కంటైనర్లలో బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల నడుమ ఉంచి సముద్రమార్గంలో ముంబయి, కోల్‌కత్తా, కేరళ ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తారు. ఇక్కడి నుంచి సరిహద్దు దేశాలకు సరుకును లారీల ద్వారా చేరవేస్తారు. భూటాన్, చైనా, నేపాల్ లాంటి దేశాల్లో 500 కిలోలకన్నా తక్కువ ఎర్రచందనంను ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎవరైనా తీసుకెళ్లొచ్చు. ఇక్కడ అది నేరం కాదు. దీనికన్నా ఎక్కువ తీసుకెళితే జరిమానాలు వేసి వదిలేస్తారు. దీంతో స్వదేశంలో టన్ను ఎర్రచందనం ‘ఏ’ గ్రేడు దుంగలు రూ.30 లక్షలు పలికితే, అదే సరుకును విదేశాలకు స్మగ్లర్లు రూ.2 కోట్లకు అమ్ముతున్నారు. సరుకు చేరిన తరువాత విదేశాల్లోని స్మగ్లర్లు వారి ఏజెంట్ల ద్వారా మన దేశ స్మగ్లర్లకు నగదును ముట్టజెబుతారు.  

ఎర్రచందనంతో ఏం చేస్తారు?
జిల్లాలో ఆపరేషన్ రెడ్‌ను ప్రారంభించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లల్లో వేల మంది కూలీలను, స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అందరి సందేహం ఒక్కటే. కేవలం ఎర్రచందనాన్ని విదేశాల్లో బొమ్మలు, గృహోపకరణ వస్తువుల తయారీకి మాత్రమే ఉపయోగిస్తారా..? దీనికి మించి మరేదైనా ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం చేరువలో ఉంది.

మరిన్ని వార్తలు