రూ.3.31 కోట్లతో గిరిజన కాలనీల అభివృద్ధి

3 Mar, 2014 04:20 IST|Sakshi

 బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్: కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, విడవలూరు మండలాల్లోని గిరిజనకాలనీల్లో రూ.3.31 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం కాగులపాడు గిరిజనకాలనీకి రూ.83లక్షలు, జొన్నవాడ గిరిజన కాలనీకి రూ.44లక్షలు, ఇస్కపాళెం పంచాయతీ వడ్డిపాళెం గిరిజన కాలనీకి రూ.46లక్షలు మంజూరైనట్లు చెప్పారు. కొడవలూరు మండలం యల్లాయపాళెం తేళ్లమిట్ట గిరిజనకాలనీకి రూ.51.44 లక్షలు విడుదలైనట్లు తెలిపారు.

విడవలూరు మండలం బుసగాడిపాళెం గిరిజనకాలనీకి రూ.1.5 కోట్లు మంజూరైనట్లు వివరించారు. ఈ నిధులతో గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సిమెంట్‌రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అలాగే కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లోని గిరిజన కాలనీలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపామని, త్వరలో ఆయా మండలాలకు సంబంధించిన నిధులు మంజూరవుతాయని తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసిన గృహనిర్మాణ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు