అడవి బిడ్డలకు ఆకులే మాస్క్‌లు

12 Apr, 2020 10:30 IST|Sakshi

వీరంతా విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురంలోని గిరి శిఖరాన గల మాలమామిడి గ్రామంలో నివశిస్తున్న గిరిజనులు. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో.. ఒడిశా రాష్ట్రానికి సమీపంలో ఉండే ఈ అడవి బిడ్డలు కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి అడవిలో లభించే చెట్ల ఆకులనే మాస్కులుగా ధరిస్తున్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్నందున మాస్కులు వాడాలని గ్రామ వలంటీర్లు తమకు చెప్పారని వీరంతా తెలిపారు. తమ వద్ద మాస్కులు లేకపోవడంతో అడవిలో లభ్యమయ్యే ఔషధ గుణాలున్న ఆకులు, నారలతో మాస్కులు తయారు చేసుకుని ధరిస్తున్నామని చెప్పారు. అలాగే గిరిజనులు  తమకు తాముగా భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.   – సాక్షి ప్రతినిధి, విజయనగరం

పేనాలు తీసే రోగమంట కదా
పేనాలు తీసే అదేదో రోగమొచ్చిందని అందరూ అంటన్నారు. అంతా ఇంటికాడే ఉండాలంట గదా. బైటకొచ్చినా దూరం.. దూరంగా ఉండాలంటన్నారు. ముక్కు, నోరు కప్పుకోమం ట్నారు. అందుకే దూరంగా ఉంటూ, ఆకులతో ఇలా ముక్కు, నోరు కప్పుకుంట్నాం.– కొర్ర పొట్టమ్మ, గిరిజన మహిళ (8 వేలు దాటిన కరోనా కేసులు)

 గిరి‘జన చైతన్యం’

కరోనా వైరస్‌ వ్యాప్తి విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో లేదు. అయినా కరోనా నియంత్రణ చర్యలను అక్కడి గిరిజనులు చక్కగా పాటిస్తున్నారు. మైదాన ప్రాంతాలవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 
ప్రభుత్వ ఆదేశాలు, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ పిలుపు మేరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మంచినీళ్ల కుళాయిల వద్దకు వచ్చినా, డీఆర్‌ డిపోల నుంచి నిత్యావసరాలు తీసుకునేందుకు వెళ్లినా కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తున్నారు. మాస్కులు ధరిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదుకాకపోవ డానికి గిరిజనుల చైతన్యమే కారణంగా చెబుతున్నారు.                         – సాక్షి, విశాఖపట్నం 

మరిన్ని వార్తలు