సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ నిర్మాణం, మండల స్థాయి శిక్షణ శిబిరాలు వంటివాటిపై నేతలు చర్చించనున్నారు. కాగా, కార్యవర్గ సమావేశంలో చర్చించాల్సిన అజెండాను ఖరారు చేసేందుకు కేసీఆర్ సహా ఆపార్టీ కొద్దిమంది ముఖ్యనేతలు గురువారం భేటీ అయ్యారు. కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై ఏర్పాటైన జీవోఎం ఓ నివేదిక ఇవ్వాలని, వర్షాలతో దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం, అభయ ఘటనపై తగిన చర్యలు, నవంబర్ రెండో వారంలో శిక్షణ శిబిరాలు, పార్టీ నిర్మాణంపై దృష్టి, ఆంక్షలు లేని తెలంగాణ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పటిష్ట అమలు వంటి వాటిపై తీర్మానం చేయనున్నారు. అదేసమయంలో ఈ నెల 26న వైఎస్సార్సీపీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావానికి అవాంతరాలు కల్పించరాదని టీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయించింది.
టీఆర్ఎస్ గూటికి జిట్టా బాలకృష్ణారెడ్డి: టీఆర్ఎస్ మాజీ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి తిరిగి ఆ పార్టీ గూటికే చేరనున్నారు. జిట్టా చేరికకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే పచ్చజెండా ఊపినట్టు తెలిసింది. దీంతో రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ను జిట్టా కలువనున్నట్టు సమాచారం.