ఏపీ రాజకీయాల్లో కేసీఆర్‌​ కీలక పాత్ర: మాజీ మంత్రి

7 Jan, 2019 10:35 IST|Sakshi

తిరుపతి: వచ్చే నాలుగు నెలల్లో దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం తిరుమల తిరుపతి స్వామి దర్శనం చేసుకున్న తలసాని అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ఫెడరల్‌ ఫ్రెంట్‌ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. నూతనంగా ఏర్పడిన ఏపీలో ప్రభుత్వ పాలన సక్రమంగా లేదని, అధికార పార్టీ అభివృద్ధి పనులు చెయ్యకుండా ప్రతిపక్షం తరహాలో దీక్షలు చేస్తోందని విమర్శించారు.

ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు పక్కనపెట్టి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ వెంట పడుతున్నారని అన్నారు. చంద్రబాబు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలెప్పుడూ సంతోషంగా ఉండాలని కేసీఆర్‌ కోరుకుంటారని, ఆంధ్రా రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారని తెలియజేశారు.

మరిన్ని వార్తలు